Site icon HashtagU Telugu

Farmers’ Protest:ఢిల్లీలో మళ్ళీ రైతు ఆందోళనలు.. డిమాండ్లు ఏమిటి? ఎందుకు?

Farmers Imresizer

Farmers Imresizer

ఇవాళ మరోసారి ఢిల్లీ వేదికగా రైతులు గర్జించనున్నారు. దేశంలో పెరుగుతూ పోతున్న నిరుద్యోగ అంశంపై గళం విప్పనున్నారు. నిరుద్యోగంపై సోమవారం (నేడు) ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ‘మహా పంచాయత్’ పేరుతో నిరసన దీక్షను రైతు సంఘాలు నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు పంటలకు కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రైతులు మండి పడుతున్నారు. వేలాది మంది రైతులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీ పోలీసులు అలర్ట్‌

దీంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో కాంక్రీట్‌ బారీకేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల వివరాలను పరిశీలించిన తర్వాతే పోలీసులు వారిని వదులుతున్నారు.

రాకేష్‌ తికాయత్‌ అరెస్టు..

దాదాపు 40 వ్యవసాయ సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా పేరిట ఒకే గొడుగు కిందకు వచ్చి.. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగుతున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద జరిగే నిరసనలో పాల్గొనేందుకు దేశ రాజధానిలో అడుగుపెట్టిన రైతు నాయకుడు రాకేష్‌ తికాయత్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌కు వెళ్తుండగా ఘాజీపూర్‌లో తికాయత్‌ను అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం పని చేస్తున్న ఢిల్లీ పోలీసులు… రైతుల గొంతును అణచివేయలేరని, ఈ అరెస్టు కొత్త విప్లవాన్ని తెస్తుందన్నారు రాకేష్‌ తికాయత్‌.

గత ఏడాది ఏమైంది?

గతేడాది ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను వెనక్కి తీసుకుంది.