Sam Pitroda : శ్యాం పిట్రోడా.. ఈయన పేరు ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. ఈయన సీనియర్ కాంగ్రెస్ నేత. అమెరికాలోని వారసత్వ పన్ను గురించి ప్రస్తావిస్తూ శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా బీజేపీ అగ్రనేతలు భగ్గుమన్నారు. ‘‘అమెరికాలో ఎవరైనా సంపన్నులు చనిపోతే అందులో ఎక్కువ భాగం దేశానికి ఇచ్చేస్తారు. వారసులకు కొంతే దక్కుతుంది’’ అని శ్యాం పిట్రోడా వ్యాఖ్యానించారు. ఆ చట్టాన్ని ఆయన సమర్థిస్తూ మాట్లాడటం ఎన్నికల వేళ వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ రంగంలోకి దిగి.. శ్యాం పిట్రోడా అభిప్రాయంతో తమ పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఇక శ్యాం పిట్రోడా(Sam Pitroda) కూడా తన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు. ఇంతకీ శ్యాం పిట్రోడా ఎవరు ? గతంలో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన దాఖలాలు ఏమిటి ? తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- కాంగ్రెస్ పార్టీకి చెందిన విదేశీ వ్యవహారాలన్నింటినీ శ్యాం పిట్రోడా చూస్తుంటారు.
- ఆయన ప్రస్తుతం ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ విభాగానికి చీఫ్గా ఉన్నారు.
- విదేశాల్లో ఉన్న భారతీయులతో సన్నిహితంగా ఉండడం, పార్టీకి వాళ్లకి దూరం పెరగకుండా చూసుకోవడం పిట్రోడా బాధ్యతలు.
- ఎన్నో ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
- మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలలో పిట్రోడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
- 20005-2009 మధ్య కాలంలో నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్గానూ పిట్రోడా సేవలు అందించారు.
- రాజీవ్ గాంధీ హయాంలో టెలీకమ్యూనికేషన్స్, వాటర్ మేనేజ్మెంట్, డెయిరీ ఉత్పత్తులకు సంబంధించి ఎన్నో కొత్త విధానాలను మన దేశంలో తీసుకురావడంలో పిట్రోడా ముఖ్య పాత్రను పోషించారు.
- 1984లో కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కుల ఊచకోత అంశంపై 2019 సంవత్సరంలో మీడియా ప్రతినిధులు శ్యాం పిట్రోడాను ప్రశ్నించారు. అందుకు పిట్రోడా ‘అయితే ఏంటి’ అని సమాధానం ఇవ్వడం వివాదానికి దారితీసింది. అప్పుడు జరిగిందేదో జరిగిందని ఆయన చాలా సింపుల్గా ఆన్సర్ ఇవ్వడం వివాదాన్ని క్రియేట్ చేసింది.
- 2019లో పాక్ ఆక్రమిత కశ్మీర్పై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. అయితే అప్పట్లో దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
- ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఆలయాలు ఉద్యోగాలను సృష్టించలేవు’’ అని పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయ రగడను క్రియేట్ చేశాయి. ‘‘నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలతో దేశం సతమతం అవుతుంటే ఆలయాల గురించి మాట్లాడతారేంటి ?’’ అని అప్పట్లో పిట్రోడా బీజేపీపై నిప్పులు చెరిగారు.
- ఈ ఏడాది జనవరిలో రాజ్యాంగంపై పిట్రోడా వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘‘మనదేశ రాజ్యాంగ రూపకల్పనలో బీఆర్ అంబేద్కర్ కన్నా నెహ్రూయే ఎక్కువగా కష్టపడ్డారు’’ అని పేర్కొనడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.