Modi Vs Ajay Rai : ఉత్తరప్రదేశ్లోని ‘వారణాసి’.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల్లో పోటీచేసే లోక్సభ స్థానం !! 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బంపర్ మెజారిటీతో మోదీ గెలిచారు. వరుసగా మూడోసారి ఇక్కడి నుంచి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోడీ రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అజయ్రాయ్ను(Modi Vs Ajay Rai) వారణాసి నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇంతకీ ఆయన ఎవరు ? బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
అజయ్రాయ్.. యూపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు!! అజయ్రాయ్ను కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి ప్రధాని మోడీపై పోటీకి నిలిపింది. 2019 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీచేశాయి.ఈసారి రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. దీంతో ప్రధాని మోడీకి బలమైన పోటీ ఇవ్వొచ్చని ఇండియా కూటమి భావిస్తోంది. అజయ్రాయ్ను యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో బాహుబలి నేతగా పిలుస్తుంటారు. మళ్లీ రాయ్కే కాంగ్రెస్ పార్టీ వారణాసి టికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం.. ఆయన సామాజిక వర్గమే అని తెలుస్తోంది. భూమిహార్ సామాజిక వర్గానికి చెందిన అజయ్రాయ్ తూర్పు ఉత్తర్ప్రదేశ్లో చాలా చోట్ల ఓటర్లను ప్రభావితం చేయగలరు. ఒకప్పుడు పూర్వాంచల్ ప్రాంతం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. ప్రధాని మోడీ వారణాసిలో అడుగు పెట్టినప్పటి నుంచి హస్తం పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ప్రాంతం నుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి కాంగ్రెస్ను దెబ్బకొట్టారు.
యూపీ కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే..
ఇంతకుముందు వరకు యూపీ కాంగ్రెస్ చీఫ్గా బ్రిజ్లాల్ ఖబ్రీ ఉండేవారు. అయితే ఆయన పనితీరు అంత సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రధాని మోడీపై వారణాసి నుంచి పోటీ చేసే అజయ్రాయ్కు వ్యూహాత్మకంగానే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను అప్పగించారు. హస్తం పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రియాంకా గాంధీ కీలక పాత్ర పోషించారని అంటున్నారు.
బీజేపీ నుంచే ప్రస్థానం షురూ
- ఏబీవీపీ, సంఘ్ నుంచి అజయ్రాయ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది.
- గతంలో అయిదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
- 1996, 2002, 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలోని కొలాస్లా స్థానం నుంచి బీజేపీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా అజయ్రాయ్ ఎన్నికయ్యారు.
- ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
- 2009లో సమాజ్వాదీ పార్టీలో చేరిన అజయ్రాయ్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి చేతిలో ఓడిపోయారు.
- 2012లో కాంగ్రెస్తో అజయ్రాయ్ ప్రయాణం ప్రారంభమైంది. అదే ఏడాది ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజయ్రాయ్ పింద్రా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఓడించారు.
- అజయ్ రాయ్ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పింద్రా నుంచి ఓడిపోయారు.
- వారణాసి లోక్సభ స్థానం నుంచి 2009లో సమాజ్వాదీ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు.