Boy Kicks Bomb : అయ్యో పాపం.. ఆ కుర్రాడు వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు తన మామయ్య ఇంటికి వచ్చాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది. అతడు బాల్లా కనిపించిన ఓ వస్తువును కాలితో తన్నగా.. ఘోర ప్రమాదం జరిగింది. బాల్లా ఉన్న క్రూడ్ బాంబు పేలిపోయి పెను విషాదాన్ని క్రియేట్ చేసింది. ఆ బాలుడి ప్రాణాలను బలిగొంది.
We’re now on WhatsApp. Click to Join
ఆ బాలుడి పేరు రాజ్ బిస్వాస్(Boy Kicks Bomb). వయసు 11 ఏళ్లు. బెంగాల్లోని బుర్ద్వాన్ పట్టణ వాస్తవ్యుడు. వేసవి సెలవుల కోసం హూగ్లీ జిల్లా పాండువా పట్టణంలోని తన మామయ్య ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం పాండువాలోని నేతాజీపల్లిలో ఉన్న కాలువ పక్కన రాజ్ బిస్వాస్ ఆడుకుంటూ బాల్ అనుకొని ఓ క్రూడ్ బాంబును కాలితో తన్నాడు. దీంతో అది పేలిపోయింది.ఈ ఘటనలో బాంబును తన్నిన బాలుడితో పాటు మరో ఇద్దరు బాలురకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని పాండువా రూరల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజ్ బిస్వాస్ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి చుంచుర ఇమాంబర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. గాయపడిన మరో ఇద్దరు బాలురను రూపమ్ బల్లభ్ (13), సౌరవ్ చౌదరి (13)లుగా గుర్తించారు. రూపమ్ చేతులకు, సౌరవ్ కాళ్లకు గాయాలయ్యాయి.
ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే.. టీఎంసీ ఇలాంటి విధ్వంసకర మార్గాలను ఆశ్రయిస్తోందని బీజేపీ హూగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు. పాండువాలో ఇంకొన్ని గంటల్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సభ జరగనుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో కలకలం రేగింది.
‘‘రూపమ్ బల్లభ్ మా మనవడు. అతడు ఇంట్లో టీవీ చూస్తుండగా ఓ స్నేహితుడు పిలిస్తే ఆడుకుందామని వెళ్లాడు. రూపమ్ బల్లభ్ బయటికి వెళ్లిన కాసేపటికే ఏదో శబ్దం వినిపించింది. నేను వెళ్లి చూస్తే.. మనవడి ఎడమ చేతికి గాయమై నేలపై పడి ఉన్నాడు’’ అని ఉషా బల్లభ్ తెలిపారు.