Vinesh Phogat : ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్కు సిద్ధమవుతున్న తరుణంలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై(Vinesh Phogat) అనర్హత వేటుపడటంపై ఇవాళ రాజ్యసభలో విపక్ష పార్టీలు సీరియస్ అయ్యాయి. ఆమెపై అనర్హత వేటు పడేందుకు దారితీసిన పరిస్థితులపై చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇందుకు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించారు. దీంతో విపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
We’re now on WhatsApp. Click to Join
ఈక్రమంలో విపక్ష ఎంపీల తీరును రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తప్పుపట్టారు. ‘‘వినేశ్పై అనర్హత వేటు పడిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది సరికాదు. ఈ రకంగా ప్రవర్తిస్తే వినేశ్ను అవమానపర్చినట్టే. రెజ్లర్గా ఆమెకు ఇంకా చాలా మజిలీ మిగిలి ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వినేశ్కు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని తమ హృదయం కూడా ద్రవిస్తోందన్నారు. యావత్ దేశం కూడా ఆమెకు ఎదురైన చేదు అనుభవాన్ని బాధగా ఫీలవుతోందని ధన్కర్ పేర్కొన్నారు.
Also Read :Vishnu Datta : గురుభక్తిపై బ్రహ్మ రాక్షసుడు, విష్ణు దత్తుడి కథ తెలుసా ?
జేపీ నడ్డా ఏమన్నారంటే..
ఇదే అంశంపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘‘వినేశ్కు యావత్ దేశం అండగా నిలుస్తుంది. ఆమె ఛాంపియన్లకే ఛాంపియన్ అని ప్రధాని మోడీ కూడా నిన్ననే అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల భావన కూడా అదే. ఈ అంశంపై సభలో చర్చ సరికాదు. ఆమె విషయంలో కేంద్ర ప్రభుత్వం, క్రీడాశాఖ, భారత ఒలింపిక్ మండలి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి’’ అని తెలిపారు.
ఖర్గే ఎలా స్పందించారంటే..
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడటం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు. అయితే దీనిపై మరింతగా మాట్లాడేందుకుగానూ ఖర్గేకు అనుమతి ఇచ్చేందుకు రాజ్యసభ ఛైర్మన్ ధన్కర్ నిరాకరించారు. దీనిపైనే కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సుర్జేవాలా విమర్శలు గుప్పించారు. ‘‘వినేశ్పై అనర్హత వేటు పడినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది ? చేజారిన ఆ పతకం మన దేశానికి రావాల్సినది. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో భారత ఒలింపిక్ సంఘం మాట్లాడాలి. మన వినేశ్కు రజత పతకం వచ్చేలా చూడాలి’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుర్జేవాలా డిమాండ్ చేశారు.