DSP To Constable : ఇంతకుముందు వరకు అతడు డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి. కానీ ఇప్పుడు అతడు ఒక కానిస్టేబుల్. ఉత్తరప్రదేశ్లోని ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ గోరఖ్పూర్ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఎందుకలా ? అనేది తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join
ఆ వ్యక్తి పేరు కృపా శంకర్ కనౌజియా. ఉత్తరప్రదేశ్ పోలీసుశాఖలో డీఎస్పీగా అతడికి మంచి పేరు ఉండేది. అయితే క్షణికానందం అతడి మొత్తం కెరీర్ను పాడు చేసింది. 2021 జూలై 6న డీఎస్పీ హోదాలో ఉన్న కృపా శంకర్ కనౌజియా అప్పటి ఉన్నావ్ జిల్లా ఎస్పీని కలిసి వెంటనే లీవ్ అడిగాడు. ఇంట్లో ఒక అర్జెంటు పని ఉందని చెప్పాడు. వెంటనే ఎస్పీ కూడా లీవ్ను మంజూరు చేశారు. అయితే లీవ్ దొరికిన తర్వాత ఇంటికి వెళ్లాల్సిన కృపా శంకర్ కనౌజియా.. కాన్పూర్ సమీపంలోని ఓ హోటల్కు వెళ్లాడు. ఆ హోటల్లో ఒక మహిళా కానిస్టేబుల్తో గడిపాడు. ఆ హోటల్కు వెళ్లాక తన అధికారిక, ప్రైవేటు ఫోన్లను కృపా శంకర్ కనౌజియా(DSP To Constable) స్విచ్ఛాఫ్ చేశాడు.
దీంతో అతడి భార్య నేరుగా అప్పటి ఉన్నావ్ జిల్లా ఎస్పీకి కాల్ చేసింది. దీంతో జరిగిన విషయమతా జిల్లా ఎస్పీ ఆమెకు చెప్పారు. లీవ్ తీసుకొని కృపా శంకర్ కనౌజియా ఇంటికి బయలుదేరారని తెలిపారు. తన భర్త ఇంకా ఇంటికి చేరలేదని.. ఆయనకు ఏమైందో అని తనకు ఆందోళనగా ఉందని కృపా శంకర్ కనౌజియా భార్య ఎస్పీకి చెప్పింది. దీంతో ఆయన పోలీసుల సైబర్ టీమ్కు చెప్పి కృపా శంకర్ కనౌజియా చివరి ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఆగిందో ట్రేస్ చేయమని ఆదేశించారు. ఈ దర్యాప్తులో ఫోన్ సిగ్నల్ కాన్పూర్లోని ఓ హోటల్ దగ్గర ఆగిపోయిందని చూపించింది. దీంతో ఉన్నావ్ ఎస్పీ కార్యాలయం పోలీసులు ఆ హోటలుకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. హోటల్లోని ఓ రూంలో మహిళా కానిస్టేబుల్తో కృపా శంకర్ కనౌజియా కలిసి ఉండటాన్ని వారు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా సేకరించారు. ఈ వివరాలను అప్పటి లక్నో రేంజ్ ఐజీకి తెలియజేయగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత శాఖాపరమైన విచారణ పూర్తయి.. ఈ శనివారం రోజున (జూన్ 22న) కృపా శంకర్ కనౌజియాకు డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ లభించింది. అతడిని ఉత్తరప్రదేశ్లోని PAC గోరఖ్పూర్ బెటాలియన్లో కానిస్టేబుల్గా నియమించారు.