World Meditation Day : ఇక నుంచి ఏటా డిసెంబరు 21వ తేదీన ‘ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం’ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహించాలంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఐరోపా దేశం లిచిటెన్స్టీన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.దీనికి భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, ఆండోరా, బంగ్లాదేశ్, లగ్జెంబర్గ్, పోర్చుగల్, బల్గేరియా వంటి దేశాలు మద్దతును ప్రకటించాయి. దీనిపై శుక్రవారం ఐరాస జనరల్ అసెంబ్లీలో చర్చించి, ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ప్రకారం.. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబరు 21వ తేదీని వరల్డ్ మెడిటేషన్ డేగా జరుపుకుంటారు.
Also Read :Cock Fighting : సంక్రాంతికి పందెం కోళ్లు రెడీ.. స్పెషల్ ఫుడ్తో ట్రైనింగ్.. హైరేంజులో రేట్లు
డిసెంబరు 21వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. భారత సంప్రదాయం ప్రకారం శీతాకాల అయనాంతం అంటే ఉత్తరాయనంలో అడుగుపెట్టే పవిత్రమైన రోజు అది. అటువంటి కీలకమైన తేదీని వరల్డ్ మెడిటేషన్ డే(World Meditation Day)గా గుర్తించడం అనేది గొప్ప విషయమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తెలిపారు. వసుధైక కుటుంబం అనే భావనను భారత్ బలంగా విశ్వసిస్తుందని ఆయన చెప్పారు. పదేళ్ల కిందటే ఐరాసలో యోగాపై భారత్ ప్రతిపాదన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వేసవి అయనాంతం అంటే దక్షిణాయంలోకి ప్రవేశించేరోజు జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014లోనే గుర్తించారు. గత దశాబ్దకాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకున్నారు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే వారికి మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చాలా అవసరం.