Ayodhya Airport : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జనవరి 22న అంగరంగ వైభవం జరగబోతోంది. ఈ క్రమంలో అయోధ్యకు వచ్చే భక్తుల కోసం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ఎయిర్పోర్టును ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. డిసెంబర్ 25వ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ రోజున మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి. అందుకే ఎయిర్ పోర్టును ప్రారంభించేందుకు ఆ తేదీని ఎంపిక చేశారు. ఆ కార్యక్రమానికి ముందే అయోధ్యలో విమాన రాకపోకలు ప్రారంభం అవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్యలోని శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(Ayodhya Airport) నిర్మాణ పనులను 3 దశల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 821 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించారు. మొదటి దశలో 2200 మీటర్ల పొడవు.. 45 మీటర్ల వెడల్పుతో రన్వే పనులను పూర్తి చేశారు. అయితే అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ రన్వేను 3750 మీటర్లకు విస్తరించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. దాని కోసం భూమిని కూడా ఇప్పటికే సేకరించారు. విమానం ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ పనులు పూర్తయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఫైర్ సేఫ్టీ వాహనాలు ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. ఆపరేషన్ కోసం లైసెన్సింగ్ ప్రక్రియ చివరి దశలో ఉంది. అయోధ్య విమానాశ్రయంలో ఎయిర్బస్ A320 వంటి విమానాలను ల్యాండింగ్ చేసే సౌకర్యం కూడా ఉంది.