Lok Sabha Secretariat : ఇవాళ ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో జరిగే పరిణామాలను యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం పాలన సాగించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 18వ లోక్ సభ నిర్వహణ కోసం లోక్ సభ సచివాలయం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఒక్క శాతం కూడా పేపర్ వాడకుండా కార్యకలాపాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. కొత్త లోక్సభ సభ్యుల రిజిస్ట్రేషన్ సహా అన్ని కార్యకలాపాలను డిజిటల్ పద్దతిలోనే సచివాలయం అధికారులు నిర్వహించనున్నారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం పార్లమెంటు ప్రాంగణంలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఈసారి ఎన్నికైన లోక్సభ సభ్యులకు సలహాలు ఇచ్చేందుకు పార్లమెంటు ప్రాంగణంలో గైడ్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. రైళ్లు, విమానాల ద్వారా వచ్చే కొత్త సభ్యుల కోసం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి పార్లమెంటుకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. లోక్సభ సభ్యుల తాత్కాలిక విడిది కోసం వెస్ట్రన్ కోర్టు హాస్టల్, హోటల్ అశోకా, ఎంఎస్ ప్లాట్స్లలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
లోక్సభ సభ్యుల కోసం వైద్య సదుపాయాలు, సీజీహెచ్ఎస్ సిబ్బందిని కూడా సంసిద్ధులుగా ఉంచారు. ఎంపీలు పార్లమెంటులో వివిధ శాఖలకు వెళ్లి సంతకాలు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫేస్ రికగ్నేషన్ ద్వారా కేంద్రీకృత ఐడీని రూపొందిస్తున్నారు.