Site icon HashtagU Telugu

Mosque Surveys : మసీదుల సర్వేకు ఆదేశాలివ్వొద్దు.. కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court Mosque Surveys Places Of Worship Act

Mosque Surveys :  అజ్మీర్ దర్గాలో శివాలయం ఉందని ఆరోపిస్తూ ఇటీవలే ఒక పిటిషన్ దాఖలైంది..  అజ్మీర్ దర్గాను సర్వే చేయించాలని సదరు పిటిషనర్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదులో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ఈ సర్వేను అక్కడి ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ వర్గం ప్రజలు, పోలీసుల మధ్య  భీకర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. తదనంతరం భారీ భద్రత నడుమ అధికారులు సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ భారత సుప్రీంకోర్టు(Mosque Surveys) కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’ను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు వాదనలు విన్నది.

Also Read :WhatsApp Translator : ‘వాట్సాప్‌ ట్రాన్స్‌లేటర్’ వస్తోంది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాల ఉనికిని ఎవరూ సవాల్ చేయకూడదని ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’ చెబుతోంది. అయితే ఈ చట్టం వల్ల హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ప్రాచీన ప్రార్థనా స్థలాలను తిరిగి సాధించుకునే హక్కుకు భంగం కలుగుతుందని పిటిషనర్లు ఆరోపించారు. ప్రస్తుతం తాము ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’లోని లక్ష్యాలు, ఉద్దేశాలపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బెంచ్ వెల్లడించింది. హిందూ ఆలయాలపై నిర్మించారనే అభియోగాలతో మసీదులను సర్వే చేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్లు, ఇకపై దాఖలయ్యే పిటిషన్ల విషయంలో నిగ్రహం పాటించాలని కోర్టులను దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ తరహా పిటిషన్లపై తొందరపాటు వైఖరితో ఎలాంటి ఆదేశాలనూ ఇవ్వకూడదని పేర్కొంది. ఈ పిటిషన్ల ఆధారంగా మసీదుల సర్వేలకు కానీ, ఇతరత్రా చర్యలకు కానీ ఆర్డర్స్ జారీ చేయొద్దని కోర్టులకు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర సర్కారుకు నిర్దేశించింది. కేంద్రం స్పందనను తెలియజేసిన నాలుగు వారాల్లోగా ముస్లిం సంస్థలు సహా ఇతర పక్షాలు స్పందనలను సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది.

Also Read :Mark Zuckerberg : ట్రంప్‌కు రూ.8వేల కోట్లు ఇచ్చుకున్న ఫేస్‌బుక్ అధినేత.. ఎందుకు ?