Menstrual Leave : ‘‘మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలి. బిహార్, కేరళ తరహాలో మిగతా రాష్ట్రాలు కూడా నెలసరి సెలవులను ఇవ్వాలి’’ అంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అది ప్రభుత్వపరమైన విధాన నిర్ణయమని.. అలాంటి అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నెలసరి సెలవులు ఇవ్వడం అనేది మంచి నిర్ణయమే అయినప్పటికీ.. దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యే రిస్క్ ఉంటుందని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘నెలసరి సెలవుల వసతిని తప్పనిసరి చేస్తే.. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు తగ్గొచ్చు. అలా జరగాలని మేం కోరుకోవడం లేదు. మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారొచ్చు’’ అని ధర్మాసనం కామెంట్ చేసింది. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు(Menstrual Leave) ఇవ్వాల్సిందే అని కంపెనీల యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీయొచ్చని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.
Also Read :BRS MLAs Disqualification : ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేసే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఫ్రేమ్వర్క్ను రూపొందించే అంశంపై కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్(Supreme Court) కోరింది. దీనికి సంబంధించిన అభ్యర్థనను కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్కు కోర్టు సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ నెలసరి సెలవులపై పిటిషన్ దాఖలవగా, విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. అది ప్రభుత్వం పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. బిహార్ ప్రభుత్వం 1992 సంవత్సరం నుంచే ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవును ఇస్తోంది. ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు మూడు రోజుల పీరియడ్ లీవ్ను అమల్లోకి తెచ్చింది.