దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు, కుక్క కాటు ఘటనలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని విచారించాయి.
ప్రజా రవాణా కేంద్రాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల నుంచి మున్సిపల్ అధికారులు పట్టుకెళ్లే వీధి కుక్కలను.. కుటుంబ నియంత్రణ ఇంజెక్షన్, వ్యాక్సినేషన్ చేసిన తర్వాత మళ్లీ అదే ప్రాంతాల్లో వదిలిపెట్టొద్దని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే ఇలా వాటి స్థానాన్ని మార్చడం వల్ల అవి గందరగోళానికి గురై ఎక్కువ దాడులు చేసే ప్రమాదం ఉందంటూ జంతు హక్కుల కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. కానీ ఈ వాదనతో ధర్మాసనం విభేదించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం ‘‘ఆందోళనకరంగా’’ మారిందని స్పష్టం చేసింది.
వీధి కుక్కలు ప్రజలపై, ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తూ ముఖాలను సైతం పీకేస్తున్న దారుణమైన ఘటనలను తాము చూస్తూ ఊరుకోలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ రూపొందించిన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ ప్రకారం.. పట్టుకున్న కుక్కలను శాశ్వతంగా జంతు సంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని ఆదేశించింది. వాటిని తిరిగి రోడ్లపైకి వదలొద్దని సూచించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల జనాభా పెరుగుతున్నప్పటికీ, వాటికి తగ్గట్టుగా జంతు సంరక్షణ కేంద్రాల మౌలిక సదుపాయాలను పెంచడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. రాష్ట్రాలు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా మొక్కుబడిగా స్టెరిలైజేషన్ డ్రైవ్లు నిర్వహించడం వల్లే ఈ సమస్య అదుపు తప్పిందని ఆక్షేపించింది. ఒకవేళ ప్రభుత్వాలు ముందే పకడ్బందీగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంత ఘోరంగా తయారయ్యేది కాదని అభిప్రాయపడింది.
