Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం ఎందుకు జరిగిందని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాల అరెస్టుకు ముందు, తర్వాతి కేసు ఫైళ్లను సమర్పించాలని ఆదేశించింది. కేసును విచారించే క్రమంలో సాక్షులు, నిందితులకు డైరెక్ట్ ప్రశ్నలను ఎందుకు అడగలేదని ఈడీని నిలదీసింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘కేజ్రీవాల్ను ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన కూడా ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వింటాం’’ అని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ తరపు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. రాజకీయ నాయకుల కోసం కోర్టు సెపరేట్ నిబంధనలను అమల్లోకి తేలేదన్నారు. మొదట్లో ఈ కేసులో కేజ్రీవాల్ పేరు తెరపైకి రాలేదని, తర్వాతి దశలో ఆయన పాత్ర ఉన్నట్లు స్పష్టమైందన్నారు. కేజ్రీవాల్ అరెస్టులో రాజకీయ కోణం లేదని సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తమ వద్ద సరిపడా ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది.
‘‘2022 గోవా అసెంబ్లీ ఎన్నికల టైంలో గోవాలోని 7 స్టార్ హోటల్ ‘గ్రాండ్ హయత్’లో సీఎం కేజ్రీవాల్ బస చేశారు. దానికి సంబంధించిన బిల్లులో కొంత భాగాన్ని ఢిల్లీ ప్రభుత్వం, ఇంకొంత భాగాన్ని ఆప్ ప్రచారానికి నిధులు సేకరించిన చన్ప్రీత్ సింగ్ చెల్లించారు’’ అని సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాలను తాము అటకెక్కించామని కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది.