Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ కంపెనీకి చెందిన సరికొత్త స్పేస్ క్రాఫ్ట్ ‘స్టార్లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కు చేరుకున్నారు. ఈ జర్నీలో ఆమెతో పాటు అమెరికా వ్యోమగామి విల్మోర్ కూడా ఉన్నారు. సునీతా విలియమ్స్ జూన్ 14నే భూమికి తిరిగొస్తారని తొలుత బోయింగ్ కంపెనీ ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా ఆ ఊసే లేకుండాపోయింది. ఇంకా ఐఎస్ఎస్లోనే సునీతా విలియమ్స్(Sunita Williams) ఉన్నారు. ‘స్టార్లైనర్’ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అక్కడి నుంచి వెంటనే బయలుదేరే పరిస్థితి లేకుండా పోయింది.
We’re now on WhatsApp. Click to Join
జూన్ 26న ఐఎస్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ బయలుదేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ.. అది కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు మరో తేదీ తెరపైకి వచ్చింది. జులై 2న ‘స్టార్లైనర్’ స్పేస్ క్రాఫ్ట్లో ఐఎస్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ బయలుదేరుతారని అంటున్నారు. కనీసం ఆ తేదీ అయినా ఫిక్సా ? కాదా ? అనే దానిపై సందేహాలు రేకెత్తుతున్నాయి. మొత్తం మీద సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ ఇతర ఏడుగురు సిబ్బందితో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారు.
ఒకవేళ ‘స్టార్లైనర్’ స్పేస్ క్రాఫ్ట్లో పెద్దస్థాయి సాంకేతిక సమస్యలే ఉంటే.. మరో స్పేస్ క్రాఫ్ట్ను పంపించి సునీతా విలియమ్స్ భూమిపైకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఇలాంటి అంశాల్లో అపార అనుభవం కలిగిన ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సాయాన్ని తీసుకోవాలని బోయింగ్ కంపెనీకి ప్రజలు సూచన చేస్తున్నారు. అంతరిక్ష ప్రయాణం, పరిశోధనలపై అపార అనుభవం కలిగిన దాదాపు 20 మంది విజిల్బ్లోయర్లు కూడా ఇటీవల బోయింగ్ కంపెనీకి ఇదే తరహా సూచనలు చేశారు. అయితే ఆ దిశగా ఆలోచించే ప్రసక్తే లేదని బోయింగ్ వర్గాలు చెబుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.