Sunita Williams: బోయింగ్ కంపెనీకి చెందిన స్పేస్క్రాఫ్ట్ ‘స్టార్ లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంకా అక్కడే ఉన్నారు. స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యలు సమసిపోయి.. దాని మరమ్మతు ప్రక్రియ ముగియడానికి ఇంకొన్ని నెలల టైం పట్టొచ్చని భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి స్టార్లైనర్లో ఉన్న సాంకేతిక సమస్యలను నాసా ఇంజినీర్లు ఇప్పటికే పరిష్కరించారు. అయితే స్పేస్క్రాఫ్ట్కు సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తున్నామని.. అవి పూర్తయ్యే వరకు అది ప్రయాణం చేసే అవకాశం ఉండదని నాసా కమర్షియల్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ వెల్లడించారు. ‘స్టార్ లైనర్’ స్పేస్క్రాఫ్ట్లో ఐఎస్ఎస్కు వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగొచ్చే తేదీని ఇప్పుడే ప్రకటించలేమని ఆయన స్పష్టం చేశారు. వ్యోమగాములు ఇద్దరూ సేఫ్గానే ఉన్నారని తెలిపారు. ‘స్టార్ లైనర్’ స్పేస్క్రాఫ్ట్లోని థ్రస్టర్లు ఎందుకు పనిచేయడం లేదనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు. ఆ కారణాలను తెలుసుకోవడంపై తమ ఇంజినీర్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారని స్టీవ్ స్టిచ్ చెప్పారు. స్టార్లైనర్ మిషన్ వ్యవధిని 45 నుంచి 90 రోజులకు పొడిగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
వాస్తవానికి బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ జూన్ 14న భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. భూమికి తిరిగొచ్చే తేదీని జూన్ 26 కు మార్చారు. కానీ స్పేస్ క్రాఫ్ట్ సమస్యలు ఇంకా మిగిలి ఉండటంతో.. అందులో ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం అవుతోంది.