Iran War పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్లో నెలకొన్న యుద్ధ అనిశ్చితి, పెరుగుతున్న ముడిచమురు ధరలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీయడంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి.
సోమవారం ఉదయం 9:21 గంటల సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 1,066.36 పాయింట్లు కోల్పోయి 72,516.86 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 316.30 పాయింట్లు క్షీణించి 22,503.30 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి.
ఈ నేపథ్యంలో చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ హితేష్ టైలర్ మాట్లాడుతూ మదుపర్లు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలని సూచించారు. “స్వల్పకాలిక లాభాల కోసం వెంపర్లాడకుండా, మార్కెట్ బాగా పడినప్పుడు మౌలికంగా బలంగా ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. నిఫ్టీ 24,000 మార్కును దాటి స్థిరంగా కొనసాగితేనే మార్కెట్లో సానుకూలత వచ్చినట్లు భావించాలి. అప్పుడే కొత్తగా లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మేలు” అని ఆయన వివరించారు.
ప్రారంభ ట్రేడింగ్లో యాక్సిస్ బ్యాంక్ 4.02 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.68 శాతం, ఎస్బీఐ 2.17 శాతం చొప్పున నష్టపోయాయి. మరోవైపు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 1.14 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.46 శాతం మేర స్వల్పంగా లాభపడ్డాయి.
