Sri Krishna Birth place: మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కీలక తీర్పు వెలువరించింది. ఆర్డర్ 7 రూల్ 11పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షం దఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన పిటిషన్ల నిర్వహణను ముస్లిం పక్షం హైకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. పూజా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాన్ని ఉటంకిస్తూ హిందూ పక్షం పిటిషన్లను కొట్టివేయాలని ముస్లిం పక్షం వాదించింది. ఈ పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో.. సివిల్ దావా నిర్వహణకు సంబంధించి హిందూ పక్షం పిటిషన్లను హైకోర్టు స్వీకరించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, మధుర లోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదుపై దశాబ్ధాల నుంచి వివాదం నెలకొంది. ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 14 డిసెంబర్ 2023న, అలహాబాద్ హైకోర్టు శ్రీ కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద స్థలంలో సర్వేను ఆమోదించింది. సుప్రీంకోర్టు అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉందని, మొఘల్ కాలంలో దానిని కూల్చివేసి ఇక్కడ మసీదు నిర్మించారని హిందూ పక్షం పేర్కొంది. ఈ వివాదం 350 ఏళ్ల నుంచి కొనసాగుతోంది.
పూజా స్థలాల చట్టం 1991, పరిమితి చట్టం 1963, నిర్దిష్ట ఉపశమన చట్టం 1963 ద్వారా పెండింగ్లో ఉన్న వ్యాజ్యాలు నిరోధించబడుతున్నాయని కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రస్ట్ షాహి మసీద్ ఈద్గా (మథుర) ప్రాథమిక వాదనను ఈ తీర్పు తోసిపుచ్చింది. మరోవైపు ప్రభుత్వ రికార్డుల్లో షా ఈద్గా పేరుతో ఎలాంటి ఆస్తులు లేవని, అక్రమంగా కబ్జా చేశారని హిందూ పిటిషనర్లు వాదించారు. ఆస్తి వక్ఫ్ అని క్లెయిమ్ చేస్తే, వివాదాస్పద ఆస్తి దాత గురించి వక్ఫ్ బోర్డు తప్పనిసరిగా వెల్లడించాలని వారు వాదించారు. కాగా, పిటిషన్ల విచారణ ఆగస్టు 12న కొనసాగనుంది.
Read Also: KTR : జగన్కు కేటీఆర్ మెసేజ్.. చొక్కా నలగని రాజకీయం నడవదు..!