Supreme Court: జయహో మహిళ.. సుప్రీం కోర్టు చరిత్రలో మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనం

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో అరుదైన ఘట్టం.. సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక

  • Written By:
  • Updated On - December 1, 2022 / 02:02 PM IST

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో అరుదైన ఘట్టం.. సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బుధవారం ఏర్పాటు చేశారు. ఈ మహిళా బెంచ్‌ గురువారం పలు కేసులను విచారించనుంది. ఇందులో వైవాహిక గొడవలకు సంబంధించి 10 బదిలీ పిటిషన్లు, మరో 10 బెయిల్‌ పిటిషన్లు ఉన్నాయి.

కాగా.. ఇలా పూర్తిగా మహిళా న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో ధర్మాసనం ఏర్పాటవడం చరిత్రలో ఇది కేవలం మూడోసారి మాత్రమే. తొలిసారి 2013లో జస్టిస్‌ జ్ఞాన సుధా మిశ్ర, జస్టిస్‌ రంజనా ప్రసాద్‌ దేశాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటై పలు కేసుల విచారణలు చేపట్టింది. నిజానికి అది యాదృచ్ఛికంగా జరిగిందే. అప్పటి ప్రిసైడింగ్‌ జడ్జీ జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలమ్‌ గైర్హాజరుతో మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత.. 2018లో జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన మహిళా ధర్మాసనం ఏర్పాటైంది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉండగా.. వీరిలో ముగ్గురు మహిళా జడ్జీలు ఉన్నారు. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ బేలా త్రివేది గతేడాది ఆగస్టు 31న ఒకేరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేసే నాటికి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ కూడా సుప్రీంకోర్టు జడ్జీగా ఉన్నారు. సుప్రీంకోర్టులో అత్యధికంగా నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉన్నది అప్పుడే. ఈ ఏడాది అక్టోబరులో జస్టిస్‌ ఇందిరా బెనర్జీ పదవీ విరమణ చేశారు.

ఇక జస్టిస్‌ బి.వి. నాగరత్న.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. 2027లో ఆమె 36 రోజుల పాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. అదే జరిగితే.. సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అపూర్వ ఘనత సాధిస్తారు. కాగా.. 2020లో మద్రాసు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అమరేశ్వర్‌ ప్రతాప్‌ తొలిసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో పూర్తిస్థాయి బెంచ్‌ ఏర్పాటు చేశారు.