Railway: దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో 411 కోట్ల ఆదాయం

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 05:44 PM IST

Railway:  దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్ జీరో స్క్రాప్’ లక్ష్య సాధనలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ 411.39 కోట్ల గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ తుక్కు అమ్మకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 లో స్క్రాప్ అమ్మకం ద్వారా సాధించిన ఆదాయం రూ. 391 కోట్ల కంటే అధికం. భారతీయ రైల్వేల ఇ-ప్రొక్యూర్మెంట్ (ఐఆర్ఇపిఎస్) పోర్టల్ ఆన్లైన్లో నిర్వహించిన ఇ-వేలం ద్వారా స్క్రాప్ అమ్మకాలను సమీకరించడం మరియు వాటి విక్రయాలను చేపట్టడంలో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉంది.

భారతదేశ వ్యాప్తంగా ఇ-వేలం ప్రక్రియ కొనుగోలుదార్ల మధ్య పారదర్శకత మరియు వేలంలో పోటీతత్వాన్ని మెరుగుపరిచింది మరియు డిజిటల్ ఇండియా విధానంలో భాగంగా కాగిత రహిత లావాదేవీలకు ఊతమిచ్చింది. ఈ పద్దతి గతంలోనున్న మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించి ఈ వేలం ద్వారా పారదర్శకతను పెంపొందించడంతో కొనుగోలుదారుల నుండి వచ్చే ఫిర్యాదులను గణనీయంగా తగ్గించాయి.
దక్షిణ మధ్య రైల్వే మెటీరియల్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ “ మిషన్ జీరో స్క్రాప్” ప్రాజెక్ట్ లక్ష్యాని అమలు చేస్తూ తుక్కును వెంటనే గుర్తించడంతో పాటు, ఒక నెల కంటే ఎక్కువ సమయం గాని లేదా ఒక ట్రక్ లోడ్ పరిమాణంలో స్క్రాప్ పేరుకుపోకుండా చర్యలు తీసుకొంటోంది. దీనివలన వర్క్షాప్లు, వివిధ రైల్వే యూనిట్లు మరియు ప్రాంగణాలను శుభ్రoగా ఉంచడానికి మరియు స్క్రాప్ సామగ్రి అమ్మకం ద్వారా ఖజానాకు ఆర్థిక వనరుగా దోహదపడుతుంది. ఈ ప్రక్రియ భారత ప్రభుత్వం చేపపట్టిన “స్వచ్ భారత్ అభియాన్” ప్రాజెక్ట్ కు కూడా ఎంతగానో దోహదపడింది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఎప్పటికప్పుడు వేగవంతంగా తుక్కు అమ్మకాన్ని నిర్వహిస్తూ ఈ ముఖ్యమైన మైలురాయిని సాధించడంలో మెటీరియల్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ బృందం చేసిన కృషిని ఎంతగానో అభినందించారు. ఇ-వేలం అమ్మకం విధానం ద్వారా అమ్మకంలో పారదర్శకత ఏర్పడిందని మరియు లావాదేవీలు సులభతరం అయ్యాయని పేర్కొన్నారు.