Rajya Sabha Elections: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి. సోనియా గాంధీతో పాటు బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్లు రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సోనియా గాంధీ ఫిబ్రవరి 15న నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే. కాగా ఇతర అభ్యర్థులెవరూ పోటీ చేయకపోవడంతో ఈ ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మరియు ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు అభ్యర్థులు గుజరాత్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్ నుండి రాజ్యసభ ఎన్నికలకు ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలపై ఇతర అభ్యర్థులెవరూ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనందున, నడ్డాతో సహా మొత్తం నలుగురు బిజెపి అభ్యర్థులను పార్లమెంటు ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. నడ్డాతో పాటు, వజ్రాల వ్యాపారి గోవింద్భాయ్ ధోలాకియా, బిజెపి నాయకుడు జస్వంత్ సింగ్ పర్మార్ మరియు మయాంక్ నాయక్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో బీజేపీకి చెందిన ఎల్ మురుగన్, ఉమేష్ నాథ్ మహరాజ్, మాయా నరోలియా, బన్షీలాల్ గుర్జార్ పేర్లు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి అశోక్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
కాగా రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్), భూపేంద్ర యాదవ్ (బీజేపీ) పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. బీజేపీ ఎంపీ కిరోరి లాల్ మీనా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత డిసెంబర్లో సభకు రాజీనామా చేయడంతో మూడో స్థానం ఖాళీ అయింది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 115 మంది, కాంగ్రెస్కు 70 మంది సభ్యులు ఉన్నారు. రాజస్థాన్లో 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఫలితాల అనంతరం కాంగ్రెస్కు ఆరుగురు, బీజేపీకి నలుగురు సభ్యులున్నారు.