Military Theatre Commands : మన దేశ ఆర్మీ, వాయుసేన, నౌకాదళం కలిసికట్టుగా పనిచేసేందుకు, వ్యూహరచన చేసేందుకు మూడు మిలిటరీ థియేటర్ కమాండ్లు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి. దీనిపై వరుసగా రెండోసారి కూడా భారత త్రివిధ దళాల అధిపతుల అంగీకారం లభించింది. ఇక తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఒకవేళ మోడీ సర్కారు ఇందుకు పచ్చజెండా ఊపితే.. మన దేశానికి పశ్చిమ, ఉత్తర, భారత ద్వీప భూభాగాలను కలిగి ఉన్న సముద్ర ప్రాంతానికి చెరొక మిలిటరీ థియేటర్ కమాండ్ అందుబాటులోకి వస్తుంది. వీటిని పశ్చిమ మిలిటరీ థియేటర్ కమాండ్, ఉత్తర మిలిటరీ థియేటర్ కమాండ్, మేరిటైమ్ మిలిటరీ థియేటర్ కమాండ్ అని పిలుస్తారు.
Also Read :PM Modi Distributes Appointment Letters: 51,000 మంది యువతకు ఉద్యోగాలు.. ఆఫర్ లెటర్లను అందించిన ప్రధాని మోదీ!
మన దేశానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ చట్టం ప్రకారం ఈ మూడు థియేటర్ కమాండ్లు(Military Theatre Commands) సమన్వయంతో పనిచేస్తాయి. కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లైన్ విషయంలో చేతులు కలిపి ముందుకుసాగుతాయి. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు వేర్వేరు కమాండ్, కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. ఇకపై వీటిని సమన్వయపరుస్తూ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. భారత త్రివిధ దళాల కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, లాజిస్టిక్ విభాగాలను సమన్వయం చేసే దిశగా వ్యవస్థలలో మార్పులు చేస్తారు.
Also Read :Benefits Of Walking: ఒక గంటలో 5000 అడుగులు నడుస్తున్నారా? అయితే లాభాలివే!
కొత్తగా ఏర్పడే మూడు మిలిటరీ థియేటర్ కమాండ్లకు చెరొక కమాండర్ను నియమిస్తారు. వీరికి త్రివిధ దళాల అధిపతులకు సమానమైన ర్యాంక్ ఉంటుంది. కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన కోసం వీరు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ద్వారా రక్షణ మంత్రికి నివేదిస్తారు. ప్రస్తుతం ఈ తరహా సైన్యాల సమన్వయ వ్యవస్థ కేవలం అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాలకు మాత్రమే ఉంది. భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడి.. మూడు మిలిటరీ థియేటర్లు ఏర్పాటు కావడమే తరువాయి.