Sisodia: మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సిసోడియా

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 05:12 PM IST

Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ (AAP) నేత మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన మరోసారి ఢిల్లీ కోర్టు (Delhi Court)ను ఆశ్రయించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనను మధ్యంతర బెయిల్‌ (interim bail)పై విడుదల చేయాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం(Election campaign) చేయడానికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. సిసోడియా పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రత్యేక కోర్టు.. ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సిసోడియా అభ్యర్థనపై స్పందన తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం విచారణను ఏప్రిల్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సిసోడియా ఏడాది కాలంగా జైల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన్ని ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు బెయిల్‌ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఆయనకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయలేదు. గతంలో అనారోగ్యంతో ఉన్న తనభార్యను కలుసుకునేందుకు మాత్రమే అనుమతిచ్చింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ సిసోడియా కోర్టును ఆశ్రయించారు. ఈసారైనా సిసోడియాకు కోర్టు బెయిల్‌ ఇస్తుందో లేదో చూడాలి మరి.

Read Also: KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర