War Effect : గల్ఫ్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీశాయి, దీని ప్రత్యక్ష ప్రభావం ఇప్పుడు వంట నూనె ధరలపై కనిపిస్తోంది. గతంలో లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో రూ. 152 ఉండగా, అది ఇప్పుడు ఏకంగా రూ. 174 నుండి రూ. 178 వరకు పెరిగింది. ఆఫ్లైన్ మార్కెట్లలో కూడా ధరలు రూ. 165 నుండి రూ. 168 మధ్య కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంగా ముడి చమురు దిగుమతులు తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. ఇది ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజల జేబుకు పెద్ద చిల్లు పెడుతోంది.
ధరల పెరుగుదలతో పాటు మార్కెట్లో వంట నూనెల కొరత కూడా వేధిస్తోంది. సన్ఫ్లవర్ ఆయిల్కు డిమాండ్ ఎక్కువగా ఉండటం, సప్లై దానికి తగ్గట్టుగా లేకపోవడంతో చాలా సూపర్ మార్కెట్లు మరియు కిరాణా దుకాణాల్లో ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి. కేవలం సన్ఫ్లవర్ మాత్రమే కాకుండా, నిత్యం వాడే పల్లీ నూనె (Groundnut Oil) ధర కూడా లీటర్ రూ. 220 దాటి విక్రయించబడుతోంది. స్టాక్ ఉన్న వ్యాపారులు కూడా ధరలు ఇంకా పెరుగుతాయనే ఆశతో కృత్రిమ కొరతను సృష్టించే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గల్ఫ్ యుద్ధం గనుక మరో నెల రోజుల పాటు ఇలాగే కొనసాగితే, వంట నూనెల ధరలు మరింత ఆకాశాన్ని తాకడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుమతులపై ఆధారపడిన భారత మార్కెట్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల వల్ల తీవ్రంగా నష్టపోతోంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించకపోతే, సామాన్యుడి పళ్లెంలో కూరలు మాయమయ్యే పరిస్థితి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. హోటల్ మరియు తినుబండారాల రంగంపై కూడా ఈ ధరల ప్రభావం పడటంతో బయట ఆహార పదార్థాల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
