Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు మరియు ధూమపానం చేసే వారికి గట్టి షాక్ ఇచ్చింది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఖజానా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ‘సిన్ గూడ్స్’ (ఆరోగ్యానికి హానికరమైన వస్తువులు) పై పన్ను భారాన్ని భారీగా పెంచింది. ఇప్పటివరకు ఈ వస్తువులపై ఉన్న 28 శాతం జీఎస్టీని ఏకంగా 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి అదనంగా ఎక్సైజ్ డ్యూటీ కూడా తోడవడంతో, నేటి (ఫిబ్రవరి 1) నుంచి సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తుల ధరలు రెండంకెల స్థాయిలో పెరగనున్నాయి.
సిగరెట్ల ధరలపై ‘స్టిక్’ వారీగా భారం
ప్రభుత్వం కేవలం పన్నును పెంచడమే కాకుండా, సిగరెట్ పొడవును బట్టి వర్గీకరించి పన్ను విధిస్తోంది.
చిన్న సిగరెట్లు: 65మిమీ లోపు ఉండే సిగరెట్లపై ఒక్కో స్టిక్కు రూ. 2.05 అదనంగా పన్ను పడనుంది, అంటే ఒక ప్యాకెట్కు రూ. 20-25 వరకు భారం పెరుగుతుంది.
ప్రీమియం బ్రాండ్లు: 70మిమీ కంటే ఎక్కువ పొడవు ఉండే మీడియం, లాంగ్ సిగరెట్లపై ఒక్కో స్టిక్కు రూ. 5.4 నుంచి రూ. 8.50 వరకు ఎక్సైజ్ డ్యూటీ పెరగనుంది. దీనితో పాటు కొత్తగా ‘హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్’ ను ప్రవేశపెట్టడం వల్ల పొగాకు కంపెనీలు అదనపు నిధులను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది, ఆ భారం అంతా అంతిమంగా వినియోగదారుడిపైనే పడనుంది.
పాన్ మసాలా కంపెనీలపై ‘డిజిటల్’ నిఘా
పన్ను ఎగవేతను అరికట్టడానికి పాన్ మసాలా మరియు గుట్కా తయారీ రంగంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై ప్యాకింగ్ మెషీన్ల సామర్థ్యం ఆధారంగా పన్ను లెక్కిస్తారు. మెషీన్ నడిచినా నడవకపోయినా పన్ను కట్టాల్సిందే. అలాగే ప్రతి మెషీన్ వద్ద సీసీటీవీ నిఘా తప్పనిసరి చేస్తూ నిబంధనలు తెచ్చింది. గతంలో కంపెనీలు చూపించే ధరపై కాకుండా, ప్యాకెట్పై ముద్రించిన MRP ఆధారంగా పన్ను లెక్కిస్తారు. ఈ మార్పుల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ. 10,000 కోట్ల నుండి రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ధరల పెరుగుదల వల్ల అక్రమ రవాణా (Smuggling) పెరగకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.
