వాహనదారులకు ఎట్టకేలకు షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుపై రూ. 3- 3.40 వరకు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగ్గా.. ఇక్కడ చమురు కంపెనీలపై భారం పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత మే 15 న ధరల్ని పెంచుతున్నట్లు వెల్లడించాయి. CNG ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం మరోసారి సడెన్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని (Petrol Diesel Price Hike ) పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ రెండింటిపైనా లీటరుపై రూ. 3కు పైగా పెంచుతున్నట్లు వెల్లడించాయి. పెరిగిన ధరలు మే 15న ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. తెలంగాణలో చూస్తే హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుపై రూ. 3 కుపైనే పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 3.39 పెరిగి రూ. 110.89 అయింది. డీజిల్ ధర ఒక్కసారిగా రూ. 3.26 పెరిగి రూ. 98.96 అయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే విజయవాడలో పెట్రోల్ ధర (Vijayawada Petrol Price) లీటరుపై రూ. 3.29 పెరిగి రూ. 113.03 కు చేరింది. డీజిల్ ధర రూ. 3.14 చొప్పున పెరిగి లీటరుకు ఇప్పుడు రూ. 100.71 కు చేరింది.
దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 3 పెరిగి ఇప్పుడు లీటరుకు రూ. 97.77 గా అయింది. కోల్కతాలో రూ. 108.74, చెన్నైలో రూ. 103.67, ముంబైలో రూ. 106.68 గా ఉన్నాయి. డీజిల్ ధరల్ని చూస్తే ఢిల్లీలో రూ. 90.67 గా ఉండగా.. చెన్నైలో రూ. 95.65, ముంబైలో రూ. 93.14, కోల్కతాలో రూ. 95.13 గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే.. హైదరాబాద్లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. మరోవైపు సీఎన్జీ వాహనదారులకు కూడా గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఇక్కడ కేజీపై రూ. 2 చొప్పున పెంచేశాయి.
పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు ( Crude Oil Price )
పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో.. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 70 డాలర్ల దిగువన ఉండగా.. ఇది ఒక దశలో 125 డాలర్ల మార్కును కూడా తాకింది. ఈ క్రమంలోనే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం ఎప్పటినుంచో పెంచుతుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ రేట్లను పెంచినప్పటికీ.. ఇంధన ధరల్లో మార్పులు చేయలేదు.
చమురు కంపెనీలపై భారం కాస్త తగ్గించేందుకు ఇక్కడ ఇతర చర్యల్ని తీసుకుంటూ వచ్చింది కేంద్రం. ఇందులో భాగంగానే.. పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తర్వాత చమురు ఎగుమతులపైనా విండ్ఫాల్ టాక్స్ మళ్లీ తీసుకొచ్చింది. చాలా రోజులకు ఇప్పుడు చమురు కంపెనీలకు భారీ నష్టాలు వస్తుండటంతో ధరల్ని పెంచక తప్పలేదు.
