Lok Sabha Elections: 2024 లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై మోడీ ప్రభుత్వం కన్నేసింది. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు పార్టీ పెద్దఎత్తున విజయం సాధించేలా చూడాలని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అమిత్ షా పార్టీ నేతలతో మాట్లాడారు.
వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని హైలైట్ చేయాలని, ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సమావేశంలో షా చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శించాలంటే 10 సార్లు ఆలోచించేలా ఉండాలని అమిత్ షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.మరియు బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రార్థనలు, ఇతర మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలని అమిత్ షా కోరారు. జనవరి 1 నుండి, బిజెపి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అక్షత పంపిణీ, దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు మరియు దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పారు.
కొత్త ఓటర్లను ఆకర్షించే వ్యూహంపై కూడా కాషాయం పార్టీ సమావేశంలో చర్చించింది. దీని కోసం బహిరంగ సభలు మరియు సమావేశాలు నిర్వహిస్తామని బీజేపీ పెద్దలు చెప్తున్నారు. కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పేదలు, యువత మరియు రైతులకు మద్దతు ఇవ్వడంపై బీజేపీ దృష్టి సారిస్తుందని, 2024 లోక్సభ ఎన్నికల వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ నేతలను ఆదేశించారు.
Also Read: Toilet Showroom : మహిళా ప్రయాణికులకు ‘టాయిలెట్ షోరూమ్’.. ఫీజు కేవలం రూ.10