Modis Cabinet : ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి మండలిలో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. వారిలో ఇద్దరికి క్యాబినెట్ హోదాను మోడీ కేటాయించారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్తో పాటు బీజేపీ ఎంపీ అన్నపూర్ణాదేవికి క్యాబినెట్ హోదా దక్కింది. ఇక కేంద్ర సహాయ మంత్రులుగా అవకాశం దక్కించుకున్న మిగతా మహిళల్లో బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకుర్, నిముబెన్ బాంభణియా ఉన్నారు. వీరితో పాటు అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్కు కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. మోడీ గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 7కు తగ్గడం గమనార్హం. ఎన్డీయే మిత్రపక్షాలకు మంత్రి పదవుల కేటాయింపు ఒత్తిళ్లతో ఈమేరకు సర్దుబాట్లు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఈసారి మోడీ క్యాబినెట్లో ఏకంగా ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. స్వయంగా ప్రధాని మోడీ గతంలో గుజరాత్ సీఎంగా పనిచేశారు. ఇక కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో మధ్యప్రదేశ్ సీఎంగా సేవలందించారు. ఇక రాజ్నాథ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. ఇక మనోహర్లాల్ ఖట్టర్ గతంలో హర్యానా సీఎంగా పనిచేశారు. సర్బానంద్ సోనోవాల్ గతంలో అసోం సీఎంగా పనిచేశారు. హెచ్.డి.కుమారస్వామి గతంలో కర్ణాటక సీఎంగా సేవలు అందించారు. జితిన్ రామ్ మాంఝీ గతంలో బిహార్ సీఎంగా పనిచేశారు. ఈ ఏడుగురు మాజీ సీఎంలలో ఐదుగురు బీజేపీ నేతలు కాగా.. మిగతా వారిలో జేడీఎస్ పార్టీ నుంచి కుమారస్వామి, హిందుస్థానీ అవామీ మోర్చా నుంచి మాంఝీ ఉన్నారు.