బీహార్లో ఇటీవల రెండో విడత నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో గయా మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇక్కడ మేయర్గా గణేష్ పసవాన్ గెలుపొందారు. డిప్యూటీ మేయర్ (Deputy Mayor)గా చింతాదేవి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పారిశుధ్య కార్మికురాలు చింతాదేవి విజయం సాధించడం విశేషం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ పదవికి చింతాదేవితోపాటు మరో 10 మంది పోటీపడ్డారు.
ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆమెకు రికార్డు స్థాయిలో 50,417 ఓట్లు వచ్చాయి. ఆమె తన సమీప అభ్యర్థిపై 16 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఈ పదవిని చేపట్టడం గయ చరిత్రలో ఇదే తొలిసారి. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా పనిచేస్తున్నారు. రిజర్వేషన్ కారణంగా ఆమెకు ఈసారి గయా డిప్యూటీ మేయర్ పదవి లభించింది. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పాటు కార్మిక సంఘం, స్థానికుల మద్దతుతో ఆమె విజయం సాధించారు.
Also Read: Pakistan Flags In Uttarakhand: ఉత్తరాఖండ్లో పాక్ జెండాలు, బ్యానర్లు కలకలం
పలు రాజకీయ పార్టీలు కూడా ఆమెకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా మేయర్ గా గణేష్ పాసవాన్ మాట్లాడుతూ.. ప్రజలకు జ్ఞానోదయం కలిగించే ప్రాంతం గయ. అలాంటి ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికుడిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకుని ప్రపంచానికి సరికొత్త ఉదాహరణగా నిలిచాం. ఇది చారిత్రాత్మకం అని అన్నారు. అయితే గయా ఎన్నికల్లో సాధారణ వ్యక్తులు ఉన్నత పదవులకు ఎన్నికవడం ఇదే తొలిసారి కాదు. గతంలో 1996లో పేద వర్గానికి చెందిన భగవతీ దేవి గయా నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందారు. రాళ్లు రువ్వుతూ జీవనం సాగించే ఆమెకు జనతాదళ్ లోక్ సభ టికెట్ ఇచ్చి.. ప్రజలు పార్లమెంటుకు పంపారు.