రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓ వైపు యువనాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో సచిన్ పైలెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రాజకీయంగా ఎదగడానికి దోహదపడిన పార్టీకి సచిన్ పైలెట్ ద్రోహం చేశారంటూ ఆరోపించారు. గెహ్లాట్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సచిన్ పైలెట్ …గెహ్లాట్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.
తన స్ధాయికి తగ్గట్లుగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. తనను అసమర్థుడు, ద్రోహి అనడం దారుణమన్నారు. ఈ విమర్శలు పూర్తిగా నిరాధరమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీచేపడుతున్న భారత్ జోడో యాత్ర ఎలా విజయవంతం చేస్తారో చూడాలని సచిన్ పైలెట్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇలాంటి విమర్శలను పక్కన పెట్టి గుజరాత్ ఎన్నికలపై ఫోకస్ పెడితే బాగుంటుందని సచిన్ పైలెట్ సూచించారు. ఇప్పటికైనా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. దేశంలో కాంగ్రెస్ మాత్రమే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. ఈ సమయంలో అశోక్ గెహ్లాట్ కాస్త బాద్యతతో మెదులుకోవడం మంచిదన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకువచ్చేలా చూడాలని హితవు పలికారు.