Jaishankars Security: భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లారాయి. అయితే దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈపరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ మోడ్లో ఉంది. తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు కేంద్ర హోంశాఖ భద్రతను మరింత పెంచింది. ఆయనకు ప్రత్యేక బుల్లెట్ప్రూఫ్ కారును కేటాయించింది. ఢిల్లీలోని జైశంకర్ నివాసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read :Earthquakes : 8 దేశాల్లో భూకంపం.. గ్రీస్ నుంచి జోర్డాన్ దాకా భూప్రకంపనలు
ఇంటెలీజెన్స్ బ్యూరో నివేదికలతో అలర్ట్
జైశంకర్(Jaishankars Security)కు ముప్పు అంచనాలపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలీజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది. దీంతో 2023 అక్టోబరులో ఆయనకున్న వై కేటగిరీ భద్రతను జడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పుడు ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారును అందించారు. ప్రస్తుతం 33 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండోలతో కూడిన టీమ్ జైశంకర్కు జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా జైశంకర్ కాన్వాయ్లో చేరింది. హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలకు ముప్పు ఉన్నప్పుడు జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తుంటారు.
Also Read :Cadavers Shortage: ఒక్కో డెడ్బాడీకి రూ.లక్ష.. మెడికల్ కాలేజీల్లో ‘అనాటమీ’కి శవాల కొరత!
బీజేపీ నేతలకూ పెరిగిన సెక్యూరిటీ
ఢిల్లీ పోలీసులు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సహా 25 మంది బీజేపీ నాయకులకు భద్రతా ఏర్పాట్లను పెంచారు. తాజాగా పోలీసు భద్రత పెరిగిన నేతల జాబితాలో.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, భూపేంద్ర యాదవ్, ఎంపీలు నిశికాంత్ దూబే, సుధాంశు త్రివేది, సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఉన్నారు. ఈ నేతలకు భద్రతను కల్పించేందుకు అదనపు సంఖ్యలో పోలీసు సిబ్బందిని ఢిల్లీ పోలీసు విభాగం కేటాయించింది. వీరి నివాసాల వద్ద కూడా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.