Robert Vadra : ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానం ఎవరికి ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని దేశం మొత్తం కోరుకుంటోందన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రాబర్ట్ వాద్రా(Robert Vadra) తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారన్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నేను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. చాలామంది నాయకులు వచ్చి వారి లోక్సభ స్థానాల్లో పోటీ చేయమని నన్ను అడుగుతున్నారు. నేను 1999 సంవత్సరంలో అమేథీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. అక్కడి ప్రజలు ఈసారి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నారు’’ అని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీ అనంతరం అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాహుల్ అమేథీ నుంచి, రాయ్ బరేలీ నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే అమేథీ నుంచి రాబర్ట్ వాద్రాకు ఛాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 317 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.