PM Face : విపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ? అనే దానిపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ఈ టాపిక్పై తాజాగా రాజకీయ దిగ్గజం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ ప్రజలు మార్పును కోరుకునే మూడ్లో ఉంటే.. తప్పకుండా ఆ మార్పును తీసుకొస్తారు. ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరనేది తెలియకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు’’ అని ఆయన కామెంట్ చేశారు. ‘‘దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1977లో ప్రధాని ముఖం లేకుండానే లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత మొరార్జీ దేశాయ్ను ప్రధానిగా ఎంపిక చేశారు’’ అని శరద్ పవార్ గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో.. ప్రధానమంత్రి అభ్యర్ధిగా(PM Face) కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉంటే బాగుంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీనికి స్పందనగానే శరద్ పవార్ తాజా వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
శరద్ పవార్ కామెంట్స్పై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. ‘‘ప్రధాని అభ్యర్ధిత్వం కోసం ఖర్గేజీ పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించడంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు సంతోషంగా లేనట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ప్రధాని ముఖం లేకుండానే ఎన్నికలకు వెళ్లొచ్చని శరద్ పవార్ చెబుతున్నారు. ఇండియా కూటమిలో ఏర్పడిన చీలికకు, వైరుధ్యాలకు ఈ పరిణామాలు నిదర్శనం’’ అని పూనావాలా కామెంట్ చేశారు.
ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్ధి ఎంపికపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. దేశ ప్రజలు ప్రధానమంత్రి పోస్టుకు మోడీని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేని పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. బలమైన నాయకుడిని మాత్రమే దేశ ప్రజలు విశ్వసించి ఓటు వేస్తారని అజిత్ పవార్ తెలిపారు.