పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు, అక్రమాల ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సరళిలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం (EC) సీరియస్ అయ్యింది. ప్రధానంగా ఈవీఎంల ట్యాంపరింగ్ మరియు రిగ్గింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో, విచారణ అనంతరం రెండు నియోజకవర్గాల్లోని పలు బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
మగ్రహత్ పశ్చిమ, డైమండ్ హార్బర్లో మళ్లీ ఓటింగ్
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. మగ్రహత్ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 11 పోలింగ్ కేంద్రాల్లో, అలాగే డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో 4 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ జరగనుంది. ఈ బూత్లలో గతంలో జరిగిన పోలింగ్ను రద్దు చేస్తూ, రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. దీని కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఫాల్టా నియోజకవర్గంపై కొనసాగుతున్న ఉత్కంఠ
మరోవైపు, ఫాల్టా నియోజకవర్గంలో కూడా పోలింగ్ సమయంలో కొన్ని అక్రమాలు జరిగినట్లు నివేదికలు అందాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని పరిస్థితులపై ఎన్నికల సంఘం లోతుగా సమీక్షిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఫాల్టాలో కూడా రీపోలింగ్ నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఈసీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఈ రీపోలింగ్ నిర్ణయాలు ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
