ముఖానికి కేక్ పూశారని ముగ్గురి స్నేహితుల హత్య..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు జీతూ సైనీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడిపై రూ.50,000 రివార్డు ఉంది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్చి చంపారు. అధికారుల కథనం ప్రకారం ధరౌ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపమని కోరారు. అయితే, వారు ఆగకుండా పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఝాజర్ రోడ్డులో చుట్టుముట్టగా, […]

Published By: HashtagU Telugu Desk
Uttar Pradesh Bulandshahr Triple Murder Accused 'Birthday Boy' Killed in Police Encounter

Uttar Pradesh Bulandshahr Triple Murder Accused 'Birthday Boy' Killed in Police Encounter

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు జీతూ సైనీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడిపై రూ.50,000 రివార్డు ఉంది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్చి చంపారు.

అధికారుల కథనం ప్రకారం ధరౌ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపమని కోరారు. అయితే, వారు ఆగకుండా పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఝాజర్ రోడ్డులో చుట్టుముట్టగా, నిందితులు కాల్పులు కొనసాగించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక నిందితుడు గాయపడగా, మరొకరు చీకటిని ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడు.

గాయపడిన జీతూ సైనీని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి ఒక పిస్టల్, బుల్లెట్లు, నంబర్ ప్లేట్ లేని స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఏప్రిల్ 25న ఖుర్జాలో జరిగిన పుట్టినరోజు వేడుకలో అమర్‌దీప్ (30), మనీశ్ (28), ఆకాశ్ (18) అనే ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన కేసులో జీతూ సైనీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పుట్టినరోజు జరుపుకుంటున్న జీతూ సైనీ ముఖానికి మృతులు సరదాగా కేక్ పూయడమే ఈ ఘర్షణకు కారణమైంది. ఈ చిన్న విషయంపై మాటామాటా పెరిగి, నిందితులు ఆయుధాలతో తిరిగి వచ్చి కాల్పులకు తెగబడ్డారు.

పోలీసుల చర్యపై మృతుల కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుల ఆస్తులను కూల్చివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సైనీ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

  Last Updated: 01 May 2026, 10:41 AM IST