One Nation One Election : ప్రజలారా జనవరి 15లోగా సూచనలు పంపండి : జమిలి ఎన్నికల కమిటీ

One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన  కమిటీ కీలక ప్రకటన చేసింది.

  • Written By:
  • Updated On - January 6, 2024 / 04:20 PM IST

One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన  కమిటీ కీలక ప్రకటన(One Nation One Election) చేసింది. దేశ ప్రజల నుంచి సూచనలను స్వీకరిస్తామని వెల్లడించింది.  కమిటీకి చెందిన అఫీషియల్ మెయిల్​ లేదా ‘వన్‌ E డాట్‌ GOV డాట్‌ ఇన్’ వెబ్​సైట్‌‌కు ప్రజలు సూచనలను పంపొచ్చని కమిటీ స్పష్టం చేసింది. ప్రజలు తమ సూచనలను కమిటీ వెబ్​సైట్‌ onoe.gov.inలో కూడా పోస్ట్ చేయొచ్చని తెలిపింది. అలా వీలు కాకుంటే..  sc-hlc@gov.inకు మెయిల్‌ చేయాలని కోరింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 15 లోగా ప్రజల నుంచి వచ్చే సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటివరకు రెండు సార్లు సమావేశమైంది. దేశంలోని 6 జాతీయ, 33 రాష్ట్ర పార్టీలతోపాటు 7 గుర్తింపు పొందని పార్టీల నుంచి ఇప్పటికే జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు కోరింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనపై ఒకరోజు పరస్పర చర్చను కోరుతూ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ కూడా రాసింది. జమిలీ ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది. భారత రాజ్యాంగం ఇతర చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్‌వర్క్‌ను కోవింద్ కమిటీ దృష్టిలో పెట్టుకోనుంది. లోక్‌సభ రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకాకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం సిఫార్సులు చేయడానికి కోవింద్ కమిటీ ఏర్పాటైంది.

కమిటీలో ఎవరెవరు ఉన్నారు ?

జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించే కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు కేంద్ర సర్కారు చోటు కల్పించింది. కమిటీలో రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్​కే సింగ్, సీనియర్ అడ్వకేట్  హరీశ్ సాల్వే, లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్​ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.

Also Read: 300 Years Life : మనిషికి 300 ఏళ్ల ఆయుష్షు.. అలా సాధ్యమవుతుంది : ఇస్రో చీఫ్