Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద(terrorism) సంబంధిత ఘటనలపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారంనాడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనె, జాతీయ భద్రతా సలహాదారులు అజితో ధోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ, భద్రతా సంస్థల అధిపతులు సౌత్ బ్లాక్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుగనున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు, స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రజాభద్రత కోసం జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. జమ్మూ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాద ఘటనల తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. తాజాగా బుధవారంనాడు దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇండియన్ ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.
కాగా, దీనికి ముందు ఆగస్టు 10న అనంతనాగ్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో కథువా, దోడా, ఉదయంపూర్లో ఆర్మీ కాన్వాయ్పై దాడి సహా పలు ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. జూలై 21 వరకూ జరిగిన 11 టెర్రర్ రిలేటెడ్ ఇన్సిడెంట్లు, 24 కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లలో భద్రతా సిబ్బంది, పౌరులతో సహా 28 మంది మృతి చెందినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్సభకు తెలిపింది. గత నెలలో కుప్వారా జిల్లాలో ఎల్ఓసీ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) దాడులను భారత భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఘటనలో పాకిస్థాన్ చొరబాటుదారుతో పాటు, ఇండియన్ ఆర్మీ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మేజర్ ర్యాంక్ అధికారితో సహా నలుగురు గాయపడ్డారు.
Read Also: Telangana: సెప్టెంబరులో విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు ప్లాన్