C-295 MW Aircraft : భారత వాయుసేన కోసం మరో సరికొత్త విమానం అందుబాటులోకి వచ్చింది. సైనికపరమైన రవాణా అవసరాల కోసం వినియోగించే సీ-295 ఎండబ్ల్యూ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేతికి వచ్చింది. ఇది మధ్యశ్రేణి సరుకు రవాణా విమానం. మన ఆర్మీకి ఈ మోడల్ విమానం అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో ఉన్న హిండన్ ఎయిర్బేస్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ భారత వైమానిక దళానికి అప్పగించారు. సీ-295 విమానాలను ఎయిర్ బస్ కంపెనీ స్పెయిన్ లో తయారు చేస్తోంది.
Also read : TDP : అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి
ఈ విమానం సెప్టెంబర్ 20న స్పెయిన్ నుంచి నేరుగా గుజరాత్లోని వడోదరలో ల్యాండ్ అయింది.అక్కడి నుంచి గజియాబాద్ లో ఉన్న హిండన్ ఎయిర్బేస్ కు భారత వాయుసేన తరలించింది. రానున్న రోజుల్లో విడతల వారీగా భారత్ కు మరో 15 ‘సీ-295 ఎండబ్ల్యూ’ విమానాలు అందుతాయి. అనంతరం ఈ మోడల్ కు చెందిన 40 విమానాల తయారీ ప్రక్రియ పూర్తిగా మన దేశంలోనే జరుగుతుంది. ఈమేరకు ఎయిర్ బస్ కంపెనీతో భారత రక్షణశాఖ ఒప్పందం (C-295 MW Aircraft) కుదుర్చుకుంది. ఇక ఈరోజు ఉత్తర ప్రదేశ్ లోని గజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్బేస్లో భారత్ డ్రోన్ శక్తి-2023 కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా డ్రోన్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.