Rajasthan Assembly Polls: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు 68.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఇక ఒకటి రెండు రాళ్లదాడి ఘటనలు మినహా 200 అసెంబ్లీ స్థానాల్లోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 1862 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 5 కోట్ల 29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఈసారి 22 లక్షల 61 వేల మంది ఓటు హక్కు పొందారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటికే 3 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 51,890 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,74,000 మంది ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించగా, 1,71,000 మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి