Indian Railways : పండుగల సీజన్ రాగానే రైళ్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. టికెట్ల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులు సులభంగా టికెట్లు పొందేలా, బుకింగ్ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు భారత రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం విడుదల చేసిన ప్రకటనలో, ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ అనే సరికొత్త పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద వెళ్లే , తిరుగు ప్రయాణాల టికెట్లను ఒకేసారి బుక్ చేసుకున్న ప్రయాణికులకు, తిరుగు ప్రయాణ బేస్ ఫేర్పై 20 శాతం రాయితీ లభించనుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని స్పష్టమైన నిబంధనలు పాటించాలి. మొదటగా, వెళ్లే ప్రయాణం , తిరుగు ప్రయాణం టికెట్లను ఒకేసారి బుక్ చేయాలి. రెండోది, రెండు టికెట్లలోనూ ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్టేషన్, గమ్యస్థానం – అన్నీ ఒకేలా ఉండాలి. ఈ కొత్త పథకం కింద టికెట్ల బుకింగ్ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్ను ఉపయోగించుకునే అవకాశం నిర్దిష్ట తేదీలలో మాత్రమే ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 26 మధ్య బయలుదేరే రైళ్లలో వెళ్లే ప్రయాణానికి టికెట్ బుక్ చేయాలి. అనంతరం, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య బయలుదేరే రైళ్లలో తిరుగు ప్రయాణం కోసం ‘కనెక్టింగ్ జర్నీ’ ఫీచర్ను ఉపయోగించి టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. ముఖ్యంగా, తిరుగు ప్రయాణ టికెట్లకు సాధారణ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) వర్తించదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Dharmasthala : ఇది పుణ్యక్షేత్రమా..? స్మశాన వాటికా..? – CPI నారాయణ
అయితే, ఈ పథకానికి కొన్ని కఠినమైన షరతులు కూడా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద బుక్ చేసిన టికెట్లకు ఎలాంటి రీఫండ్ ఇవ్వబడదు, అలాగే టికెట్లలో ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదు. అదనంగా, రెండు వైపులా కన్ఫర్మ్ అయిన టికెట్లకే రాయితీ వర్తిస్తుంది. ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉన్న రైళ్లు మినహా, అన్ని రైళ్లు , అన్ని క్లాసులలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ఈ టికెట్లను ఆన్లైన్ (IRCTC వెబ్సైట్/యాప్) లేదా ఆఫ్లైన్ (స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్) ద్వారా బుక్ చేసుకోవచ్చు. కానీ, రెండు టికెట్లను ఒకే విధానంలో బుక్ చేయడం తప్పనిసరి.
ఉదాహరణకు, వెళ్లే టికెట్ ఆన్లైన్లో బుక్ చేస్తే, తిరుగు టికెట్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేయాలి. రైల్వే అధికారులు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం పండుగ సీజన్లో రద్దీని సమర్థవంతంగా నియంత్రించడం, అలాగే రైళ్ల వినియోగాన్ని రెండు వైపులా పెంచడం అని పేర్కొన్నారు. ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు ఖరారు చేసుకోవడం వల్ల, రద్దీ సమయంలో టికెట్ల కొరత తక్కువ అవుతుందని కూడా వారు అంచనా వేస్తున్నారు.