Rahul Gandhi : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రక్రియ నుంచి ఈవీఎంలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవీఎంలను మనుషులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ముప్పు ఉంటుందన్నారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా మస్క్ ఓ పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మొదటి నుంచీ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్న ఆయన.. ఎలాన్ మస్క్ వాదనకు మద్దతు పలికారు. ‘‘భారతదేశంలోని ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంలను కనీసం తనిఖీ చేయడానికి వీలు లేని పరిస్థితి ఉంది. అందుకే అవి “బ్లాక్ బాక్స్”లను తలపిస్తున్నాయి’’ అని రాహుల్ గాంధీ(Rahul Gandhi) కామెంట్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు చోటు ఇవ్వాలని భావిస్తే ఈవీఎంల తనిఖీకి అనుమతించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం ఎన్నిక ఫలితం విడుదల విషయంలో చోటుచేసుకున్న గందరగోళాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఎలాన్ మస్క్ ఈవీఎంలపై జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్లు వాడి ఇంటర్నెట్కు అనుసంధానించేలా అమెరికాలోని ఈవీఎంలు ఉంటాయి. కానీ భారత్లో తయారయ్యే ఈవీఎంలు ఏ నెట్వర్క్తో కానీ.. ఏ డివైజ్తో కానీ కనెక్ట్ కావు. ఆ విధంగా వాటిని డిజైన్ చేస్తారు. భారత్లోని ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. వీటిని రీప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదు. అచ్చం భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈవీఎంలనుు రెెడీ చేసుకోవచ్చు’’ అని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టిపెట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ఈవీఎంల హ్యాకింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరి ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు జరిగాయి. పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగాం. లేదంటే ఏమి జరిగేదో.. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలి. అలా చేస్తే ప్రతి ఓటును లెక్కించే అవకాశం ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.