Qutub Minar : కుతుబుద్దీన్ ఐబక్ 12వ శతాబ్దంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన చారిత్రక కట్టడం.. ‘కుతుబ్ మినార్’. ఈ కుతుబ్ మినార్పై(Qutub Minar) తాజాగా రువాండా దేశ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఎందుకో తెలుసా ? వివరాలు తెలియాలంటే మొత్తం వార్త చదవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join
1994 సంవత్సరంలో తూర్పు ఆఫ్రికా దేశం రువాండా దారుణమైన మారణకాండను చూసింది. ఆ ఏడాది 100 రోజుల పాటు సాగిన నరమేధంలో 8 లక్షల మంది అమాయక రువాండా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు రువాండాలో టుట్సీ, హుటు తెగల ప్రజలపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ.. వారితో భారత్ ఉందనే సందేశాన్ని ఇచ్చేందుకే ఆదివారం రోజు ఢిల్లీలోని కుతుబ్ మినార్పై రువాండా జాతీయ పతాకం రంగులను ప్రదర్శించారు. మరోవైపు ఆనాటి మారణ హోమంపై రువాండా రాజధాని కిగాలీ వేదికగా జరిగిన 30వ సంస్మరణ సభకు భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు) దమ్ము రవి హాజరయ్యారు. ఈసందర్భంగా రువాండా అధ్యక్షుడు పాల్ కగామే సామూహిక సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచి సంస్మరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా పాల్గొన్నారు. రువాండా మారణహోమం తన అధ్యక్ష పాలనా కాలం యొక్క అతిపెద్ద వైఫల్యమని క్లింటన్ అంగీకరించారు.
రువాండన్ పేట్రియాటిక్ ఫ్రంట్ (RPF) తిరుగుబాటు గ్రూపు దేశ రాజధాని కిగాలీని 1994 ఏప్రిల్ 7న చుట్టుముట్టింది. దీంతో ఆనాడు మారణహోమం మొదలైంది. 100 రోజుల హత్యాకాండ కొనసాగింది. చివరకు 1994 జూలైలో రువాండన్ పేట్రియాటిక్ ఫ్రంట్ రాజధాని కిగాలీని స్వాధీనం చేసుకుంది. అయితే దాదాపు 8 లక్షల మంది అమాయకులను చంపిన తర్వాత ఈ పరిణామం జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువమంది టుట్సీ, హుటు తెగల ప్రజలే ఉన్నారు. ఆనాడు అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ దీనిపై స్పందించలేదు. ప్రస్తుతం ప్రతి దేశపు వ్యవహారంలోనూ తలదారుస్తున్న అమెరికా.. అప్పట్లో మౌనం వహించింది. రువాండాలో రక్తక్రీడ జరుగుతుంటే.. ఏమీ తెలియదన్నట్టుగా చూస్తూ కూర్చుండిపోయింది. దీంతో ఇదే అదునుగా రువాండాలోని తిరుగుబాటు గ్రూపులు రాక్షసత్వంతో ప్రవర్తించి లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి.