Surat Diamond Bourse : అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రం గుజరాత్లోని సూరత్. సూరత్ సమీపంలోని ఖజోడ్ గ్రామంలో సూరత్ డైమండ్ బోర్స్ను రూ.3,400 కోట్ల వ్యయంతో దాదాపు 35.54 ఎకరాల్లో 67 లక్షల 28 వేల 604 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన సూరత్ డైమండ్ బోర్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం సూరత్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ను కూడా ప్రధాని ప్రారంభించారు. అంతకు ముందు ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ‘‘సూరత్ డైమండ్ బోర్స్ అనేది సూరత్ వజ్రాల పరిశ్రమ చైతన్యాన్ని, అభివృద్ధిని ప్రదర్శిస్తుంది. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు, సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉపాధి అవకాశాలను పెంచుతుంది’’ అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- సూరత్ డైమండ్ బోర్స్లో(Surat Diamond Bourse) మొత్తం 20 అంతస్తుల చొప్పున 9 టవర్లలో 4,500 కార్యాలయాలు ఉంటాయి.
- భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4 వేల మంది వ్యాపారులు ఈ ప్రాజెక్టు రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారు.
- ఈ కార్యాలయాల్లో వజ్రాల క్రయ విక్రయాలు, వేలం జరుగుతాయి.
- డైమండ్ కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులతో సహా 65 వేల మంది వజ్రాల నిపుణులు ఈ కాంప్లెక్స్ కేంద్రంగా పనిచేయనున్నారు.
- ఈ వజ్రాల మార్కెట్ కేంద్రంగా 175 దేశాల నుంచి దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
- పాలిష్ (మెరుగు పెట్టిన) చేసిన డైమండ్లను ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు.
- ప్రధాన ద్వారం నుంచి కేవలం 5 నిమిషాల్లోనే అందులోని ఏ కార్యాలయానికైనా చేరుకోవచ్చు.
- ఎస్డీబీ నిర్మాణం కోసం 46 వేల టన్నుల ఉక్కు వాడారు. అధునాతన అగ్నిమాపక సదుపాయాలతో నిర్మాణం చేపట్టారు.
- ఈ కార్యాలయంలో మొత్తం 128 లిఫ్ట్లు ఉన్నాయి. 18 సెకన్లలోనే 16వ ఫ్లోర్కు చేరుకునే వేగం వీటి ప్రత్యేకత.
- ఈ భవన సముదాయం కోసం 1.8 ఎంఎల్డీ కెపాసిటీతో నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేశారు.
- సూరత్ డైమండ్ బోర్స్లో 4 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
- అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ గేట్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
- ఈ భవన సముదాయం పైకప్పుపై 400 కిలో వాట్ సామర్థ్యం గల సౌర ఫలకాలను అమర్చారు.