Site icon HashtagU Telugu

PM Modi : టారిఫ్‌ ఉద్రిక్తతల వేళ.. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..!

Trump Called PM Modi

Trump Called PM Modi

PM Modi : రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్‌పై భారీ టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి చర్యలకు పాల్పడ్డారు. ఇప్పటికే అమలులో ఉన్న 25 శాతం దిగుమతి సుంకాన్ని మరో 25 శాతం పెంచి మొత్తం 50 శాతం చేయడంతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరులో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల్లో పాల్గొనడానికి మోడీ అమెరికా వెళ్లనున్నారు. న్యూయార్క్ వేదికగా సెప్టెంబరులో జరగనున్న ఈ సమావేశాల్లో ప్రపంచదేశాల నేతలు హాజరుకానున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోడీ, ట్రంప్ భేటీ జరిగే అవకాశం ఉంది. వాణిజ్య సమస్యల పరిష్కారంపై ఇద్దరూ చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసు.. రేపు విచార‌ణ‌కు మంచు లక్ష్మి!

అమెరికా విధించిన అధిక దిగుమతి సుంకాల వల్ల భారత్‌కు భారీ ఆర్థిక భారం తప్పకపోవడంతో, ఈ భేటీ కీలకంగా మారనుంది. మరోవైపు మోడీ పర్యటన సందర్భంగా యుద్ధ విపరిణామాల నడుమ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇటీవలే ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడారు. అదే వ్యవధిలో మరికొంత మంది అంతర్జాతీయ నాయకులతోనూ మోడీ సమావేశమయ్యే అవకాశముంది. ఈ పర్యటనలో వాణిజ్య, భద్రతా, అంతర్జాతీయ సంబంధాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆధ్వర్యంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలోనూ భారత్ రష్యా నుండి ముడిచమురు కొనుగోలు కొనసాగించడాన్ని అమెరికా అనుమానంతో చూస్తోంది. ఇది నైతికంగా తప్పనన్న అభిప్రాయంతో ట్రంప్, భారత్ దిగుమతులపై టారిఫ్‌లు పెంచారు.

ఇప్పటికే అమల్లో ఉన్న 25 శాతం దిగుమతి సుంకానికి తోడు, సెప్టెంబరు 27 నుంచి మిగతా 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. అంటే మొత్తం 50 శాతం టారిఫ్‌లు భారత దిగుమతులపై వర్తించనున్నాయి. దీని ప్రభావం ఎగుమతిదారులపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తులపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో న్యూఢిల్లీ ఇప్పటికే అమెరికాతో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించింది. ట్రంప్ నిర్ణయాల వల్ల రెండు దేశాల మధ్య వ్యాపార బంధం దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, త్వరలోనే వ్యాపార ఒప్పందానికి చర్చలు తుది దశకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ పర్యటన కూడా అదే దిశగా కేంద్రీకృతమయ్యే అవకాశముంది. భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు సుదీర్ఘంగా కొనసాగుతున్నప్పటికీ, తాజా పరిణామాలు ఈ బంధాన్ని పరీక్షించనున్నాయి. మోడీ, ట్రంప్ భేటీ ఈ సంక్షోభానికి పరిష్కార మార్గాన్ని చూపుతుందా? లేదా వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశముందా? అన్నది సెప్టెంబరులో వెల్లడవనుంది.

Read Also: India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్ట‌నున్న భార‌త్‌!