Pregnancy Test: అమ్మాయిలకు గర్భస్థ పరీక్షలు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు!

గర్భనిర్థారణ పరీక్షలతో మధ్యప్రదేశ్ లో తీవ్ర నిరసన ఎదుర్కొంటోంది బీజేపీ ప్రభుత్వం.

  • Written By:
  • Publish Date - April 24, 2023 / 11:01 AM IST

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ‘ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన’ పథకం అమలులో ఉంది. నిరుపేద యువతులు (Girls) దరఖాస్తు చేసుకుంటే అందరికీ ఒకేసారి సామూహిక వివాహాలు (Marriage) జరిపిస్తారు. పెళ్లి సమయంలో ప్రభుత్వం నుంచి రూ.56వేలు ఆర్థిక సాయం అందిస్తారు. దీనికోసం ఇటీవల దిండోరి జిల్లా గడసరాయ్‌ ప్రాంతానికి చెందిన 219 యువతులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ యువతులందర్నీ వైద్య కేంద్రానికి రమ్మన్నారు అధికారులు. సాధారణ వైద్య పరీక్షలు చేస్తారని అనుకున్నారంతా. అక్కడికి వెళ్లాక వారు గర్భ నిర్ధారణ (Pregnancy) పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్‌ (Collector) వికాస్‌ మిశ్రా వివరణ ఇచ్చారు.

‘ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుకోడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్నవారి వద్ద వివరాలు తీసుకోవడంతోపాటు వారికి కొన్ని వైద్య పరీక్షలు (Test) కూడా నిర్వహించారు. అక్కడి వరకు బాగానే ఉంది, వైద్య పరీక్షల్లో భాగంగా గర్భనిర్థారణ పరీక్షలు కూడా చేయడం వివాదానికి దారి తీసింది. పేదింటి అమ్మాయిలను కించపరిచేందుకే ఇలాంటి పరీక్షలను ప్రభుత్వం చేపట్టిందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. గర్భనిర్థారణ పరీక్షలతో మధ్యప్రదేశ్ లో తీవ్ర నిరసన ఎదుర్కొంటోంది బీజేపీ ప్రభుత్వం.

సామూహిక వివాహాలు చేసుకునే వారికి గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారని, కొంతమంది యువతులు తమకు నెలసరి సమస్యలున్నట్టు వైద్యుల (Doctors) వద్ద ప్రస్తావించారని, వారికి మాత్రమే గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారని చెప్పారు. ఆ పరీక్షల్లో నలుగురు యువతులు గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయిందని, వారిని సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొనవద్దని సూచించామని కలెక్టర్ వికాస్‌ వెల్లడించారు.

Also Read: KTR Counter: అమిత్‌షాకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్