ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jharkhand Assembly Elections) భాగంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి విడతలో 15 జిల్లాల్లో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా.. వీరిలో ప్రధాన అభ్యర్థులుగా మాజీ సీఎం చంపయీ సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాఝీ, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా, మరియు మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ ఉన్నారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలు ఏర్పటు చేయగా.. 1.37 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ నేపథ్యంలో ఓటర్లను ఉద్దేశించి అమిత్ షా, హేమంత్ సోరెన్, మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు ఓటర్లంతా తమ విలువైన ఓటుహక్కును వినియోగించుకోవాలని మల్లికార్జున ఖర్గే కోరారు. ఝార్ఖండ్ ప్రజాస్వామ్యంలో గొప్ప పండుగ జరుగుతున్న రోజు అని, రాష్ట్రం ఏర్పడి 24 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. ఈ ఎన్నికలు మరింత ముఖ్యమైనవి కాబోతున్నాయని, ఓటర్లు ఆలోచించి తమ తీర్పును చెప్పాలని మాజీ సీఎం హేమంత్ సోరెన్ కోరారు.
అవినీతి, చొరబాట్లు లేని అభివృద్ధి చెందిన ఝార్ఖండ్ను నిర్మించేందుకు ఝార్ఖండ్లో మొదటి దశలో ఓటు వేయనున్న ఓటర్లందరూ రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఇటు కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప-ఎన్నికకు (Wayanad By Election) పోలింగ్ కొనసాగుతుంది. రాహుల్ రాజీనామాతో ఇక్కడ ఉప-ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ నుండి ప్రియాంకా గాంధీ బరిలో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక పోటీచేయడం ఇదే మొదటిసారి. దీంతో యావత్తు దేశం ఈ ఎన్నికపై ఎంతో ఆసక్తి కనపరుస్తుంది.
Read Also : Elections Today : ఓట్ల పండుగ.. జార్ఖండ్లో పోల్స్.. వయనాడ్, 31 అసెంబ్లీ స్థానాల్లో బైపోల్స్