400 Paar Vs 40 Seats : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజ్యసభలో ప్రస్తావించారు. ‘‘బెంగాల్ నుంచి ఎవరో చెప్పిన విధంగా కాంగ్రెస్కు 40 మించి లోక్సభ సీట్లు రావద్దని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అబ్కీ బార్ 400 పార్’’ అంటూ ప్రధాని మోడీ చేస్తున్న వ్యాఖ్యలపై ఇటీవల రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెటైర్స్ వేశారు. వీటికి తాజాగా బుధవారం రాజ్యసభలో మోడీ కౌంటర్ ఇచ్చారు. “ఆ రోజు నేను ఖర్గేజీ ప్రసంగం వింటున్నప్పుడు.. ఆయన అంత స్వేచ్ఛగా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఆశ్చర్యపోయాను. ఆ ఇద్దరు కమాండర్లు ఆ రోజు సభలో లేకపోవడాన్ని నేను గమనించాను. ఆ ఇద్దరూ లేకపోవడంతో.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ దొరకదని భావించి ఖర్గేజీ(400 Paar Vs 40 Seats) స్వేచ్ఛగా కామెంట్స్ను సంధిస్తూ ఫోర్లు, సిక్సర్లు కొట్టారు’’ అని మోడీ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
కాంగ్రెస్ పార్టీలో కుటుంబానికే తప్ప నాయకులకు విలువ ఉండని ప్రధాని తెలిపారు. కుటుంబ సభ్యులకు భారతరత్న కోరడం.. దేశ రాజధానిలోని రోడ్లకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవడాన్ని బట్టి హస్తం పార్టీ దిగజారుడు వైఖరిని అర్థం చేసుకోవచ్చన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారని నేను అడగను.. కానీ కాంగ్రెస్పై బ్రిటీష్ వాళ్ల ప్రభావం లేదా ? అని అడుగుతున్నాను. అలాంటప్పుడు కాంగ్రెస్ హయాంలో రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా ఎందుకు మార్చలేదు ? సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని ఎందుకు కంటిన్యూ చేశారు ? వార్ మెమోరియల్ను ఎందుకు ఏర్పాటు చేయలేదు ? ప్రాంతీయ భాషలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అని ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దళితులు, బీసీలు, ఆదివాసీలకు వ్యతిరేకం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆనాడు ముఖ్యమంత్రులకు రాసిన లేఖల అనువాదాన్ని నేను చదివాను. తాను రిజర్వేషన్లకు, ఉద్యోగాల్లో కోటాలకు అనుకూలం కాదని నెహ్రూ ఆ లేఖల్లో స్పష్టంగా చెప్పారు. రిజర్వేషన్ కోటాలలో ప్రజలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తే.. పని ప్రమాణాలు తగ్గుతాయని నెహ్రూ భావించేవారు’’ అని మోడీ వివరించారు. శామ్ పిట్రోడాను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మార్గదర్శక్ ఒకరు అమెరికాలో కూర్చొని ఉన్నారు. గత ఎన్నికల టైంలో ఆయన(శామ్ పిట్రోడా) ‘హువా తో హువా’ వ్యాఖ్యతో ఫేమస్ అయ్యారు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రను తగ్గించి.. నెహ్రూ పాత్రను పెంచి శామ్ పిట్రోడా మాట్లాడారు’’ అని చెప్పారు. ఉత్తర భారత్, దక్షిణ భారత్ పేరుతో దేశంలో చీలికను క్రియేట్ చేసే దురుద్దేశంతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మోడీ ఆరోపించారు.