Supreme Court – 75 : 1950 జనవరి 28న ఏర్పాటైన భారత సుప్రీంకోర్టు.. ఈరోజు 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈసందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టులో తొలిసారిగా 1950 జనవరి 28న ఉదయం 9.45 గంటలకు న్యాయమూర్తులు తొలిసారిగా సమావేశమయ్యారు. దీంతో ఈ తేదీనే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభోత్సవ సమయంగా పరిగణిస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు నడుస్తున్న భవనం అందుబాటులోకి వచ్చేంతవరకూ.. పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం కొనసాగింది. ప్రస్తుతం ఢిల్లీలోని తిలక్మార్గ్లో ఉన్న సుప్రీంకోర్టు భవనం 17 ఎకరాల త్రికోణాకార స్థలంలో నిర్మితమైంది. 1954 అక్టోబరు 29న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరో నాలుగేళ్లకు 1958 ఆగస్టు 4న ఆయనే దీన్ని ప్రారంభించారు. సుప్రీంకోర్టు(Supreme Court – 75) చిహ్నంగా సారనాథ్లోని అశోకుడి స్తూపం నుంచి ధర్మచక్రాన్ని స్వీకరించారు. ఈ చిహ్నం కింద న్యాయం ఎక్కడుంటే విజయం అక్కడే అని సూచిస్తూ ‘యతో ధర్మస్తతో జయః’ అనే సంస్కృత సూక్తి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
సుప్రీంకోర్టు ఏర్పాటైన కొత్తలో ఏడాదికి 28 రోజులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే సమావేశమయ్యేది. ఆ తర్వాత క్రమంగా పనిరోజులను పెంచుకుంటూ సుప్రీంకోర్టు ఏడాదికి 190 రోజులు పనిచేసే స్థాయికి చేరుకుంది.
తొలినాళ్లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 8 (7+1) ఉండగా.. అది ఇప్పుడు 34కు చేరింది. 75 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటివరకు 49 మంది ప్రధాన న్యాయమూర్తులు, 191 మంది న్యాయమూర్తులు సేవలందించారు.
సుప్రీంకోర్టు ప్రారంభమైన 39 ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తిని చూసింది. 77 ఏళ్లకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని చూడనుంది. కేరళకు చెందిన ఫాతిమా బీవీ 1989 అక్టోబరు 6న బాధ్యతలు చేపట్టి సర్వోన్నత న్యాయస్థానం తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీవీ నాగరత్న 2027 సెప్టెంబరు 24న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు.