65 Percent Reservations : 65 శాతం రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది.

  • Written By:
  • Updated On - June 20, 2024 / 01:39 PM IST

65 Percent Reservations : బిహార్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈవిధంగా రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తెలిపింది. అందుకే 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి బిహార్‌లో రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. ఎలా అనేది తెలుసుకోవాలంటే.. గత సంవత్సరం నవంబరు నెలకు మనం వెళ్లాలి. బిహార్‌ సర్కారు నిర్వహించిన కులగణన నివేదికను ఆ నెలలోనే రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ నివేదికలో వెల్లడైన వివరాల ఆధారంగా విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును రాష్ట్ర సర్కారు తీసుకొచ్చింది. దీనికి  అప్పట్లో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం దానిపై గెజిట్‌ కూడా రిలీజైంది.

Also Read : Telangana Police : ‘యూఎన్ పీస్ మిషన్‌’కు 19 మంది తెలంగాణ పోలీసులు

దీంతో బిహార్‌లో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి(65 Percent Reservations)  చేరాయి. ఆర్థికంగా వెనకబడినవారికి మరో 10శాతం రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయి. అవి కూడా కలిపితే బిహార్‌లో రిజర్వేషన్లు  75 శాతానికి పెరిగాయి. దీంతో ఎస్సీల రిజర్వేషన్ 16 నుంచి 20 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్ ఒక శాతం నుంచి రెండు శాతానికి, ఓబీసీ, ఈబీసీల రిజర్వేషన్లు 30శాతం నుంచి 43 శాతానికి పెరిగాయి.  ఈమేరకు రిజర్వేషన్లు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని వర్గాలు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఇవాళ తుది తీర్పును ఇచ్చింది. కాగా, కులగణనను బీజేపీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. కానీ ఎన్డీయే కూటమిలోని కీలకమైన మిత్రపక్షం దీన్ని సమర్ధిస్తోంది. గత ఏడాది కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని నడిపిన టైంలోనే సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలో కులగణన చేయించారు. ఇకపై కులగణన అంశంపై బీజేపీ, నితీశ్ కుమార్ రాజకీయ పార్టీ జేడీయూ ఏవిధంగా కలిసి ముందుకు సాగుతాయనేది వేచిచూడాలి.

Also Read : Ramayana Skit : ‘రామాయణం’పై నాటకం.. ఐఐటీ బాంబే విద్యార్థులకు ఫైన్‌