Farmers Protest : చండీగఢ్లో సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM)ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంఎం నాయకుడు సర్వన్సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. పంటలకు కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్దమైన హామీతో పాటు రైతులకు సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీ వైపుగా పాదయాత్ర చేస్తామని నిర్ణయించినట్లు తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాము ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్చలు జరపడం లేదని ఆయన మండిపడ్డారు.
కాగా, గత 9 నెలలుగా రైతులు మౌనంగా కూర్చున్నామని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆందోళనను ఉధృతం చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే శంభు సరిహద్దు నుంచే విడతల వారీగా ఢిల్లీకి బయలు దేరతామని చెప్పారు. ఇకపోతే..కాగా, గతంలో రైలు సంఘాలు ఢిల్లీ మార్చ్కు పిలుపునివ్వగా భద్రతా బలగాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 13 నుంచి రైతులు శంభూ బార్డర్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్దమైన హామీతో పాటు వ్యవసాయ రుణమాఫీ, రైతు కూలీలకు పెన్షన్, గత నిరసనల్లో భాగంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణ వంటివి నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.