One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర సర్కారు ఏర్పాటుచేసిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటివరకు 5వేలకుపైగా సలహాలు, సూచనలు వచ్చాయి. లాస్ట్ డేట్ జనవరి 15 కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు వచ్చిన 5వేలకుపైగా సూచనలన్నీ ఈ-మెయిళ్ల ద్వారా అందాయని అధికార వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ప్రస్తుతమున్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లో ఏవిధమైన మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందనే దానిపై సూచనలు చేయాలని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సారథ్యంలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఇటీవల కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలను పంపొచ్చని వెల్లడించింది. కమిటీ వెబ్సైట్ onoe.gov.in లో సూచనలను పోస్ట్ చేయాలని లేదంటే sc-hlc@gov.in ఐడీకి కూడా ఈ-మెయిల్ చేయొచ్చని కోరింది. జమిలి ఎన్నికలపై స్టడీ చేసేందుకు ఈ కమిటీ గతేడాది సెప్టెంబరులో ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలను నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది. దీనిపై న్యాయ కమిషన్ సలహాలను సైతం(One Nation One Election) స్వీకరించింది. ఈ అంశాలన్నీ కలిపి ఒక సమగ్ర తుది నివేదికను కమిటీ రూపొందించనుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర సర్కారు తదుపరి నిర్ణయాలను తీసుకుంటుంది.
We’re now on WhatsApp. Click to Join.